ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై హైకోర్టు భవనాలు, తెలంగాణ భవన్, ఉస్మానియా ఆస్పత్రి, ప్రాంతీయ రింగ్రోడ్డు (ఉత్తరం), ఇందిరా మహిళా శక్తి భవనాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనాల నిర్మాణం, అకడమిక్ బ్లాక్లు, రెసిడెన్షియల్ జోన్ల ఏర్పాటు ప్రణాళికలపై సీఎస్ చర్చించారు. ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలలోని పెట్రోల్ బంక్లు తొలగించేందుకు రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలతో సంయుక్త తనిఖీ చేయాలని హైదరాబాద్ కలెక్టర్ను ఆదేశించారు.
16 ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, మరో ఆరు భవనాల నిర్మాణాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ఈ భవనాలన్నీ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని సి.ఎస్ తెలిపారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి పరిపాలన, అకడమిక్ స్ట్రక్చర్ తదితర అంశాలపై విధివిధానాలను రూపొందించాలని ఆమె విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ (TEWIDC) ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ భవన్ నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ స్థితిగతులపై చర్చించారు.