నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారం వ్యవధిలో మూడు సార్లు మధ్యాహ్న భోజనం కల్తీ అయ్యి విద్యార్థులు అస్వస్ధతకు గురవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో మూడు సార్లు భోజనంలో కల్తీ జరిగితే అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి మాగనూరు సంఘటన నిదర్శనమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది చాలా సీరియస్ అంశమని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడంలేదని ప్రభుత్వ లాయర్ ను హెచ్చరించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు వ్యాఖ్యలకు వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది రిప్లై ఇవ్వగా… జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరిచండానికి వారం వ్యవధి ఎందకుని సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని నిలదీశారు. వారికి కూడా పిల్లలు ఉంటారు కదా… అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాలలో హాజరవుతారని హైకోర్టు హెచ్చరించింది.