మార్గదర్శి కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలకు విరుద్దంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న కేసులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయకపోవడం పట్ల తెలంగాణ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇరు ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చెయ్యడానికి మూడు వారాల గడవు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ మూడు వారాల్లోగా కోర్టుకు కౌంటర్ అఫిడవిట్లు సమర్పించకపోతే రెండు రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కేసు నమోదయ్యింది. హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉన్న మార్గదర్శి సంస్ధ ప్రజల నుంచి ఏవిధంగా నగదు డిపాజిట్లు సేకరిస్తుందని అభ్యంతరం తెలుపుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసు నమోదు చేసింది. అయితే తమపై నమోదు చేసిన ఆకేసును కొట్టివేయాలని 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్ధ ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్వాష్ పిటీషన్ను ఉమ్మడి హైకోర్టు విభజన రోజైన 2018 డిసెంబర్ 31 అనుమతించిన కోర్టు ప్రభుత్వం మార్గదర్శిపై పెట్టిన కేసును కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టు చివరి పనిదనం రోజున ఇచ్చిన ఈ ఆదేశాలపై పిటీషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటీషనర్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు వినాలని హైకోర్టుకు తిరిగి ఈకేసును పంపింది సుప్రీంకోర్టు. తాజాగా ఈ కేసు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రాధారాణిల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా కౌంటర్లు వేయకపోడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.