మూడు రోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్పై బీఎన్ఎస్లోని సెక్షన్ 105,118(1) r/w 3(5) కింద కేసు నమోదై నట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఆ రోజు పరిణామాలపై కొంత వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ ఈరోజు(శుక్రవారం) అవాస హోటల్లో ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశం రద్దు చేశారు. దీంతో ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకూడదని పోలీసులు అల్లు అర్జున్ ను ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆ రోజు తొక్కిసలాటలో మహిళ చనిపోగా వారు కుమారుడు ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని సమాచారం. సందట్లో సడేమియా అన్నట్టుగా వామపక్ష విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ ను కూడా అరెస్టు చేయాలని…లేదంటే సినిమా నడవనీయమని హెచ్చరికలు జారీ చేశాయి. పుష్ప మీడియా సమావేశం నిర్వహించినా వామపక్ష విద్యార్థి సంఘాలు గొడవ చేసే అవకాశముందని, ముందు జాగ్రత్తగా వారించినట్టు విశ్వసనీయ సమాచారం.
బన్నీ మరే థియేటర్ వద్దకు వెళ్లినా.. జనాలు పోగవుతారని.. అదే సమయంలో తోపులాట జరిగే ప్రమాదం ఉందని భావించి పోలీసులు అల్లు అర్జున్ ను హౌస్ అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం తెలియవలసింది.
మరోవైపు, ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ముంబై బాంద్రాలోని గెలాక్సీ థియేటర్ లో పెప్పర్ స్ప్రే కలకలం రేపింది. ఇంటర్వెల్ కు ముందు గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రే చేశాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చాలా మంది దగ్గుతూ బయటకు పరుగులు తీశారు. దీంతో, సినిమా నిర్వాహకులు దాదాపు 20 నిమిషాల పాటు షోను ఆపేశారు. పెప్పర్ స్ప్రే ఘాటును తొలగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత షోను కొనసాగించారు.
ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యంతో పాటు కొందరు ప్రేక్షకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానం ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ‘పుష్ప-2’పై అక్కసుతోనే కొందరు ఇలా చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.