విజయవాడ వాసులకు ముఖ్య గమనిక. మార్చి ఒకటి నుంచి రూల్స్ మారనున్నాయి. నిబంధనలు పాటించకపోతే మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. మార్చి ఒకటి నుంచి హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. హెల్మెట్ ధరించకపోతే వేయి రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. హెల్మెట్ వాడకంపై ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడలో అధికారిక లెక్కల ప్రకారం వందకు 75 మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఈ శాతాన్ని 75 నుంచి 95 శాతానికి పెంచాలని విజయవాడ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 మే ఆఖరి నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించకపోతే భారీ జరిమానాలు విదించాలని నిర్ణయించారు.ప్రస్తుతం హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారికి రూ.135 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే మార్చి ఒకటి నుంచి ఈ మొత్తాన్ని రూ.1000లకు పెంచారు. రాష్ట్రంలో జరుగుతున్న ద్వి చక్రవాహనాల రోడ్డు ప్రమాదాలపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే హెల్మెట్ ధరించి ఉంటే ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు కూడా హెల్మె్ట్ ధారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నో హెల్మెట్, నో ఎంట్రీ విధానం కూడా తీసుకువచ్చారు. విజయవాడలోకి ప్రవేశించే మార్గాలైన ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వంతెన, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో ఎంట్రీ పాయింట్ల వద్ద నిత్యం తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. హెల్మె్ట్ లేకుండా బండి నడిపేవారిని హెచ్చరిస్తూ హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రచారంలోనూ విజయవాడ పోలీసులు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్న వారి కుటుంబసభ్యులను, భార్యా పిల్లలను రప్పించి.. వారి ద్వారా చెప్పిస్తున్నారు. అలాగే నగరవ్యాప్తంగా పెద్దఎత్తున బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధిస్తూ హెల్మెట్ వాడకాన్ని కఠినతరం చేస్తున్నారు
- Advertisement with us -