హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం సమసిపోయింది. ఇరువర్గాలు రాజీకి వచ్చాయి. స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభవం కల్పించడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య టికెట్ల విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంపై చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఇరువర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఇరువర్గాలు కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారం, ఇరు వర్గాలు 10% కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వటానికి అంగీకరించాయి.
సీఎం రేవంత్ ఘాటు హెచ్చరికతో ఇరు పక్షాల పెద్దలు సర్దుకున్నారని తెలుస్తోంది. దీంతో, వివాదం సద్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ వివాదం సమసి పోవడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్కు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సాయంత్రానికి సీన్ మారిపోయింది. హెచ్సీఏ పెద్దలు, సన్ రైజర్స్ ప్రతినిధుల మధ్య పలు ధపాలుగా చర్చలు జరిగాయి. నిబంధనల ప్రకారమే కాంప్లిమెంటరీ పాసులు ఇస్తామని, అదనంగా ఒక్క పాస్ కూడా ఇవ్వబోమని ఎస్ఆర్హెచ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో.. హెచ్సీఏ అపెక్స్ కమిటీ దానికే అంగీకరించింది. ఈ మేరకు ఇరువురు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. పాత ఒప్పందం ప్రకారమే.. స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో పదిశాతం కాంప్లిమెంటరీ పాసులను హెచ్సీఏకు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించింది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్హెచ్కు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ స్పష్టమైన హామీ ఇచ్చింది.
దీంతో వివాదాలన్నీ ముగిశాయని హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హెచ్సీఏ కార్యదర్శి ఆర్.దేవరాజ్ నేతృత్వంలో జరిగిన చర్చల్లో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొని వివాదానికి ముగింపు పలికారు.
కాంప్లిమెంటరీ పాసులు దుర్వినియోగమయ్యే అవకాశమున్నందున.. హెచ్సీఏ ఖాతా నుంచి నిధులు చెల్లిస్తే మరో వెయ్యి పాసులు ఇస్తామని తమ ప్రతినిధులు చెప్పినట్లు, దీంతో వారిపై జగన్మోహన్రావు స్టేడియంలోనే దూషణలకు దిగినట్లు ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ కోసం విజిలెన్స్ అధికారులు ప్రయత్నించారు. మరోవైపు.. ఎస్ఆర్హెచ్ నుంచి తాను అడిగినన్ని టికెట్లు అందకపోవడంతో ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా వీవీఐపీలు కూర్చునే ఎఫ్3 బాక్స్కు జగ న్మోహన్రావు తాళం వేయించారని, తాము బతిమిలాడి 2వేల పాస్లు ఇస్తేనే తాళాలు తెరిచారని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు ఆరోపించారు. దీంతో ఈ అంశంపైనా అధికారులు విచారణ జరిపారు. మ్యాచ్ రోజు ఎఫ్-3 బాక్స్కు తాళం వేశారా? ఆరోపణలు నిజమేనా? అనే కోణంలో విచారణ చేశారు. అయితే సాయంత్రానికి ఇరువర్గాలు రాజీకి రావడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో, ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్య పరిష్కారమయ్యేలా చేశారంటూ సీఎం రేవంత్రెడ్డికి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపారు.