ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందో ప్రయోగం GSLV-F15 సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి చేరింది. ఈ ప్రయోగంలో NVS-02 శాటిలైట్ను అంతరిక్షంలోకి చేర్చారు. అయితే ఈ ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరిన తర్వాత మొరాయించింది. దీంతో అది నిర్ణీత కక్ష్యలోకి చేరలేదు.
ఈ ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరిన తర్వాత సరైన కక్ష్యలోకి చేరేందుకు థ్రస్టర్లను మండిస్తారు. అయితే ఇప్పుడీ థ్రస్టర్లు పనిచేయడం లేదని ఇస్రో తెలిపింది. సరైన కక్ష్యలోకి చేరకపోతే.. నావిగేషన్ వ్యవస్థకు ఈ ఉపగ్రహం పనికిరాదని చెప్పొచ్చు. నిజానికి ఈ ఉపగ్రమం భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థకు ఎంతో కీలకం.
ఉపగ్రహం పనికిరానట్టేనా?
ప్రస్తుతం ఈ ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో భూమి చుట్టూ తిరుగుతోంది. నావిగేషన్ కోసం చూసుకుంటే ఇది సరైన కక్ష్య కాదు. అయితే ప్రస్తుతం తిరుగుతున్న కక్ష్యలోనే దీనిని నావిగేషన్ కోసం ఉపయోగించుకునేందుకు ఇస్రో వ్యూహాలు రచిస్తోంది. నిజానికి థ్రస్టర్లను మండించేందుకు ఆక్సిడైజర్ను పంపాలి. కానీ ఆక్సిడైజర్ను పంపే వాల్వ్లు తెరుచుకోవడం లేదు. అదే ఇక్కడ సమస్య. అయితే ఉపగ్రహం మాత్రం చక్కగా పనిచేస్తుందని ఇస్రో తెలిపింది.