విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్కారు గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చిలుకూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయిందని దాన్ని తొలగించడానికే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు మొట్ట మొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారని అందులో చదువుకున్న వారు ఎంతో మంది ఐఎఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐఎఎస్ బుర్రా వెంకటేశం, ఐపీఎస్ మహేందర్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులే అని తెలిపారు. డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మనది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు ఒకేసారి డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, శ్రీమంతుడుకి, పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు వారంలో రెండు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలు సందర్శించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయమని విద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.