ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3వ తేదీన తెలుగు, 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 5వతేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ లో మొత్తం ఏడు సబ్జెక్టులు ఉంటాయి.
విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వివరించింది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎపిపిఎస్సి అధికారులు వెల్లడించారు. పరీక్ష సమయానికి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా అనుమతిస్తారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 8:30 నుండి 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపింది.
అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు రాకూడదని ఏపిపిఎస్సి అధికారులు స్పష్టం చేశారు. ఎపిపిఎస్సి గ్రూప్ వన్ లో వివిధ స్థాయిలకు చెందిన 89 పోస్టులు భర్తీ చేయనున్నారు.