ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 27వ తేదీ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి బలపరచిన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ ఓటమి పాలయ్యారు. కూటమి అభ్యర్థి రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. అయితే తాము ఇద్దరిని బలపరిచామని, శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధే అని ఇప్పుడు టీడీపీ చెపుతుండటం విశేషం. ఫిబ్రవరి 27వ తేదీని గుంటూరు, కిష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటుగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరిగింది. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్ధిగా రఘువర్మను ప్రకటింస్తూ టీడీపీ, జనసేనలు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాయి. ఆ తరవాత ఎన్నికల్లో కూడా రఘవర్మ గెలుపు కోసం ఈ రెండు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఉత్తరాంధ్రలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా పీఆర్టీయూ బలపరచిన గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించుకున్నాయి. ఈ స్ధానంలో 20,794 ఓట్లు పోలవ్వగా.. అందులో 659 చెల్లనవిగా గుర్తించారు. మిగిలిన 20,135 ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉండగా తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులు నాయుడికి 7,210 వచ్చాయి అతని సమీప ప్రత్యర్ధులు ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,845, యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,804 ఓట్లు లభించాయి. దీంతె రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా శ్రీనివాసులునాయుడికి 9,237 ఓట్లు, వర్మకు 8,527 ఓట్లు లభించాయి. ఇంకా శ్రీనివాసులునాయుడి ఎన్నికకు 831ఓట్లు అవసరమయ్యాయి. దీంతో రెండో స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఈ లెక్కింపులో 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాసులునాయుడిని విజేతగా ప్రకటించారు.
ఇక కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82 వేల 320 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో లక్షా 45 వేల 57 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 62 వేల 737 ఓట్లు సాధించారు. మొత్తం 2 లక్షల 41 వేల 491 ఓట్లు పోలయ్యాయి. అందులో 26 వేల 679 ఓట్లు చెల్లనివే ఉన్నాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో: గుంటూరులోని ఏసీ కాలేజీలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతి కావడంతో పాటు బరిలో 25 మంది ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ టైమ్ పట్టింది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో కొనసాగారు. ప్రత్యర్థుల్లో సిటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. మిగిలినవారు నామమాత్రంగానే ఓట్లు సాధించారు.
అలాగే ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఐదొవ రౌండ్ ముగిసే సమయానికి లక్షా 40 వేల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందులో 12వేల 93 ఓట్లు చెల్లని ఓట్లుగా తేల్చగా లక్షా 27వేల 907లోట్లు చెల్లుబాటు అయ్యాయి. తెలుగుదేశం బలపరచిన పేరాబత్తుల రాజశేఖరానికి 80 వేల 37 ఓట్లు పోలవ్వగా పీడీఎఫ్ అభ్యర్ధి దిడ్డి వీరరాఘవులుకు 29వేల 665 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది.