అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ బడ్జెట్ ప్రసంగం.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్మీట్ మాదిరిగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. సభలో గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్తో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెప్పించిందని విమర్శించారు.
రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని.. మొత్తంగా చూస్తే.. 20 నుంచి 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. కానీ, గవర్నర్తో మాత్రం రుణమాఫీ పూర్తి చేశామని చెప్పించారన్నారు. ఏఐ, డేటా సైన్సెస్ అని పెద్దమాటలు చెబుతున్నారని.. నో విజన్.. ఓన్లీ 20శాతం కమిషన్ అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతూ.. ఢిల్లీకి మూటలు పంపే విజన్ కొనసాగిస్తున్నారన్నారు. చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచులను వేధించి.. చివరకు విదేశీ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండిపెట్టకుండా పిల్లలను చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. కేసీఆర్పై ద్వేషంతనే మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టారని, ఫలితంగా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండి పోయాయని ఆరోపంచారు. ఎండిపోయిన పొలాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్ల 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు కేటీఆర్. మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుండి మంచిగా మూట కట్టి గాంధీ భవన్కు పంపిస్తామని.. ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీసీలను కులగణన పేరుతో వంచించి.. అవమానించిందని విమర్శించారు.
ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా.. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండానే కొత్త ప్రాజెక్టుకు ఇటుక పెట్టకుండా రూ.1.62లక్షలకోట్ల అప్పు చేసినందుకు రేవంత్రెడ్డిని గవర్నర్ మందలిస్తారనుకుంటే.. అక్కడ కూడా గాంధీభవన్లో ప్రసంగం చేసేలా కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం సాగిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావుడప్పు కొట్టాలి. కానీ, పెళ్లిల్లో డీజే కొట్టినట్లు గవర్నర్ డబ్బా కొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దావోస్లో రూ.1.79లక్షలకోట్ల పెట్టుబడులు తెచ్చామని, మరోసారి గవర్నర్ అబద్ధాలు చెప్పించారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.