ఆంధ్రప్రదేశ్లో సరికొత్త వ్యవస్థ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌరసేవలు ప్రారంభమయ్యాయి. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ పేరుతో 161 పౌరసేవలు పొందవచ్చు. ఈ సరికొత్త వ్యవస్థ గురించి, ఆ సేవలు ఎలా పొందాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. జనవరి 30వ తేదీన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఈ సేవలను ప్రారంభించారు. దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం జారీచేయాల్సిన ఆయా సర్టిఫికెట్ల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. వాట్సప్ ఉంటే చాలు.. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ ద్వారా 161 పౌరసేవలు అందుకోవచ్చు. త్వరలో రెండోదశలో మరో 360 సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
వాట్సప్ సేవలను ఎలా పొందాలి? :
ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో సరికొత్త పద్ధతిలో సేవలను అందిస్తోంది. ఈ సేవలను పొందాలనుకునేవారు ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 9552300009 నెంబర్ను మన మొబైల్లో సేవ్ చేసుకోవాలి. 9552300009 వాట్సప్ నెంబర్ ఈ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్కు) ఉంటుంది. ఈ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేయాలి. వెంటనే ఏపీ ప్రభుత్వ పౌర సేవలకు స్వాగతం అని సందేశం వస్తుంది. చివర్లో “సేవను ఎంచుకోండి” అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పై నొక్కితే ప్రభుత్వ శాఖల పేర్లు కనిపిస్తాయి. ఇందులో విద్యుత్తు, దేవాదాయ, రెవెన్యూ, పురపాలకశాఖ, ఏపీఎస్ఆర్టీసీ సేవలతోపాటు వినతులు స్వీకరించేందుకు వీలుగా ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి. మీకు కావాల్సిన ఆప్షన్పై నొక్కి సంబంధిత శాఖ సేవలను పొందవచ్చు. 9552300009 వాట్సప్ నెంబర్ ద్వారా 36 ప్రభుత్వ విభాగాలను ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 161 సేవలు అందుబాటులో ఉంటాయి.
రెండోవిడతలో ఏఐ టెక్నాలజీ వినియోగం :
ఇక, ఈ వాట్సప్ గవర్నెన్స్ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. తొలి విడతను ప్రారంభించి.. 161 సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. త్వరలోనే రెండో విడత సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. రెండో విడతలో 360 సేవలను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. రెండో విడత వాట్సప్ గవర్నెన్స్కు ఏఐ టెక్నాలజీని కూడా జోడించనుంది. ప్రతి సర్టిఫికెట్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాట్సప్ గవర్నెన్స్తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చు. ధ్రువపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకునే వీలు ఉంటుంది. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను చెల్లించొచ్చు. ప్రస్తుతం తీసుకువచ్చిన వ్యవస్థలో ఏమైనా లోటు పాట్లు ఉంటే వెంటనే సరిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఐటీ మంత్రి లోకేశ్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సేవలు తీసుకురాలేదన్న ఆయన.. ఎంవోయూ చేసుకున్న 3 నెలల 9 రోజుల్లోనే దీనిని ప్రారంభించామని చెప్పారు.