39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు రంగంలోకి ప్రభుత్వం

ఫేక్ వీడియోలు, ఏఐ ఫోటోలు వాడుతూ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుండటమే కాకుండా, సమాజంలోని శాంతిభద్రతలను భంగపెట్టే ప్రమాదముందని సీఎం స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. నేరుగా చర్యలు తీసుకోవడం వల్ల విమర్శలు వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందుగా హైకోర్టు ఆదేశాలు తీసుకోవాలన్నదే వారి దృష్టి. ఇందుకోసం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫేక్ వీడియోలు సృష్టించి వాటిని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కోర్టు నుంచి ఆదేశాలు తీసుకురావాలన్నది ప్రభుత్వ యోచన.

విశేషంగా, కంచ గచ్చిబౌలి ఘటనను కేంద్రంగా చేసుకొని, వన్యప్రాణులు చెల్లాచెదురుగా పరిగెడుతున్నట్లు చూపిస్తూ ఎడిటెడ్ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారైన ఫేక్ కంటెంట్‌ను వైరల్ చేయడం ద్వారా ప్రజల్లో భయం కలిగించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇవన్నీ సమాజాన్ని గందరగోళానికి గురిచేసే కుట్రలాగా భావిస్తోంది. ఈ కేసుపై హైకోర్టు ఏప్రిల్ 24వ తేదీన విచారణ జరపనుంది. ఆ రోజే వివిధ పక్షాల వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కోర్టు నుంచి అనుకూల ఆదేశాలు వెలువడితే, ఇప్పటికే గుర్తించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసే అవకాశముంది.

ఇటీవలే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్‌ క్రిషాంక్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ క్రిషాంక్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, మరికొంతమంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు కూడా నోటీసులు అందించనున్నట్లు సమాచారం.

కొంతమంది అర్థరాత్రి నెమళ్లు ఆర్తనాదాలు చేస్తున్నట్లు, జింకలు అరుస్తూ పారిపోతున్నట్లు ఫేక్ ఆడియోలు అద్దుకున్న వీడియోలు పోస్ట్ చేశారు. ఇవన్నీ ముందే ప్లాన్ చేసిన కుట్రగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫేక్ వీడియోల ప్రభావంతో కొన్ని జాతీయ మీడియా వేదికలపై కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, అందువల్ల ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించరాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

గతంలో పోలీసులు నేరుగా అరెస్టులు చేసేవారు. కానీ తరచూ కోర్టుల్లో వారు ఊరట పొందే పరిస్థితి ఉండేది. ఈసారి ముందుగా కోర్టు ఆమోదాన్ని తీసుకొని, తర్వాతే చర్యలు చేపట్టే వ్యూహాన్ని ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇక కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఉద్యమించిన ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. వారి కేసులను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com