-
అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ
-
అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక
-
సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. అందరి అభిప్రాయాలు తీసుకొని.. నష్టం జరగకుండా ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. ఈ అంశాన్ని కీలకంగా తీసుకొని అన్ని పార్టీలను సమన్వయం చేసుకోవాలంటూ.. ముందస్తుగానే జాగ్రత్త పడాలని ఇటీవల కేయాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో మాట్లాడి కార్యాచరణ రూపొందించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిలకు సీఎం రేవంత్ అప్పగించారు. ముఖ్యమంత్రి సూచనలో భాగంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖను విడుదల చేశారు.
అయితే, సమిష్టి కార్యచరణను రూపొందించే క్రమంలో అఖిల పక్ష సమావేశం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టి సారించారు. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు డిప్యూటీ సీఎం. అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఇరువురు నేతలు చర్చించారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ఇవాళే అన్ని పార్టీల ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి వేదికను ఖరారు చేసేందుకు నిర్ణయించారు. వేదిక విషయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం గానీ, పూలే ప్రజా భవన్ గానీ అన్ని పార్టీల నేతలకు ఏది అనుకూలంగా ఉంటే ఆ వేదికను ఖరారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.