తెలంగాణ రాష్ట్రంలోని మామిడి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం పరిధిలో పండిస్తున్న మామాడి పండ్లను తెలంగాణ బ్రాండ్ పేరుతోనే ఎగుమతులు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పండే మామిడి పండ్లను శుద్ధి చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో రైతులే నేరుగా విదేశాలకు ఎగుమతులు చేసుకునేలా ఏర్పాట్లు చేయబోతోంది. ఈ ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఉద్యాన శాఖ రూ.35 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలు రూపొందించింది.
తెలంగాణలో పండిస్తున్న మామిడి పండ్లకు అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉంది. మన రాష్ట్రంలో ప్రతి యేడాదీ సుమారు ఆరు వేల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా.. వాటిలో వెయ్యి టన్నుల వరకు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ముంబై, బెంగళూరుల మీదుగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో రైతుల కంటే మధ్యవర్తులు, కాంట్రాక్టర్లు లాభాలు గడిస్తుండటంతో, రైతులకు సరైన రీతిలో ఆదాయం లభించడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ఎగుమతులకు అవసరమైన అత్యాధునిక శుద్ధి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దీనిలో భాగంగా, మామిడిపై ఉండే పురుగులను తొలగించే రేడియేషన్ ప్రక్రియ కోసం రూ.24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ యంత్రం, పండ్లను మెరిసేలా చేసే వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రూ.5 కోట్లు, మామిడిని మగ్గబెట్టే హాట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రూ.3 కోట్లు, నిల్వ కోసం కోల్డ్ రూమ్స్కు రూ.4 కోట్లు మరియు ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ కోసం రూ.2 కోట్లు కేటాయించనున్నారు.ఈ ప్రాజెక్టులో భాగంగా బాటసింగారం పండ్ల మార్కెట్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ప్యాక్హౌస్లను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో కోహెడ అంతర్జాతీయ మార్కెట్ ప్రారంభమయ్యాక అక్కడ కూడా పదికి పైగా అత్యాధునిక ప్యాక్హౌస్లను నెలకొల్పాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. ఈ చర్యల ద్వారా తెలంగాణ మామిడి రైతులు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించి అధిక లాభాలు పొందడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, తెలంగాణ మామిడి బ్రాండ్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మామిడి రైతులకు నిజంగా ఒక తీపి కబురుతెలంగాణలో ప్రధానంగా హిమాయత్, బంగినపల్లి, దశేరి వంటి రకాలు పండుతాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తోంది. తాజాగా నిర్ణయం వారి ఆదాయాన్ని మరింత పెంచనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ప్యాక్హౌస్లలో, ఎగుమతి ప్రక్రియలో అనేక మందికి ఉపాధి దొరకనుంది.