- పసిడి కొనాలంటే గుండె గుభేల్
- అక్షయ తృతీయ నాటికి లక్షరూపాయలు
- ప్రస్తుతం పదిగ్రాముల పసిడి ధర 98,400
- 10 గ్రాముల బంగారం లక్ష దాటే ఛాన్స్
- అమెరికా, చైనా టారిఫ్ వార్ తో సంక్షోభం
- పెట్టుబడులకు బంగారమే బెటర్ అంటున్న ఇన్వెస్టర్లు
- ఈక్విటీలు, బాండ్లు, షేర్లు అమ్మేసి బంగారం పై దృష్టి
- పెరుగుతున్న సెల్ అమెరికా బై గోల్డ్ మానియా
అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆల్ టైమ్ హై ని చేరుకుంటున్నాయి.సమీప భవిష్యత్తులో బంగారం మరింత ప్రియం కానుందని మార్కెట్ సమీకరణలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయి. గత 16నెలలుగా నిరంతరంగా బంగారం ఆల్ టైమ్ హై లోనే కొనసాగుతోంది. 2024లో 39ఆల్ టైమ్ హై స్కోర్ కాగా అది ఇప్పుడు 62 ఆల్ టైమ్ హై స్కోర్ కి చేరుకుంది.
ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్ ల యుద్ధం, చైనా, అమెరికా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్ అన్నీ కలసి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. దాంతో ఇన్వెస్టర్లు ఇప్పుడున్నపరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడమే నయం అనుకుంటున్నారు. దాంతో బంగారానికి తిరుగులేని మహర్దశ పట్టింది.
గత శుక్రవారం బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఔన్సు బంగారం ధర ఆల్ టైమ్ హై 3,245 అమెరికన్ డాలర్లుగా నమోదైంది. ఇక బుధవారం నాడు ఔన్స్ బంగారం ధర 107 డాలర్లకు మించి పెరిగి 3,330 డాలర్లకు చేరింది.పుత్తడి ధర 3,300 డాలర్లను తాకడం చరిత్రలో ఇదే ప్రధమం. దాంతో దేశీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు మండుతున్నాయి.హైదరాబాద్ లో బంగారం బులియన్ మార్కెట్ లో పది గ్రాములు (24క్యారెట్లది) 98,400 రూపాయలకి చేరింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకి బాండ్ మార్కెట్ దారుణంగా పతనమైంది.దాంతో టారిఫ్ ల అమలుపై 90 రోజుల స్టే విధించక తప్పలేదు.
స్టాక్ మార్కెట్ సంక్షోభంలో యూఎస్ ట్రెజరీ పెట్టుబడులు నష్టపోగా డాలర్ విలువ పెరిగింది. కానీ ఇప్పుడు ట్రెజరీ పెట్టుబడులు పుంజుకోగా, డాలర్ మాత్రం నేల చూపులు చూస్తోంది. కానీ ఇప్పుడు ప్రపంచ విఫణి వ్యాపార సూత్రం మారిపోయింది. యూఎస్ఈక్విటీలు, బాండ్లు, డాలర్లు అమ్మేసి బంగారంపై పెట్టే పెట్టుబబడి సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాను అమ్మేసి బంగారం కొనాల్సిన పరిస్థితి. ప్రపంచ విఫణిలో అమెరికాకు సంబంధించిన పెట్టుబడులు వదిలించుకుని బంగారం పై పెట్టడం ఉత్తమం అనే ధోరణి వచ్చేసింది. ఔన్స్ బంగారం ధర అంత చేటున పెరిగిపోగా, ఇది ఇంకా మొదలేనని, భవిష్యత్తులో ఇది మరింతగా పెరుగుతుందని విశ్లేషకుల అంచనా.
మరో మూడు నెలల్లో పదిగ్రాములు లక్ష !
ఈ ఏడాది పొడవునా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు 98వేల 400గా ఉంది.మరో త్రైమాసికానికి ఇది లక్షరూపాయలు దాటేసే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లో గోల్డ్ ర్యాలీ ఇలాగే కొనసాగితే అక్షయ తృతీయ నాటికి పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకోవడం గ్యారంటీ అంటున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు.అమెరికా, చైనా మధ్య టారిఫ్ రగడ ముదురుతుండటంతో ప్రపంచ మార్కెట్లు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
మనదేశంలో బంగారం ధరలు వేర్వేరు నగరాల్లో స్థానిక డిమాండ్ ను బట్టి కొంత అటూ ఇటూగా మారుతున్నాయి. అయితే నగల వర్తకులు, నగల ప్రియులు కూడా 22 కారెట్ల బంగారం మన్నికలోనూ, దరలోనూ మేలైనదిగా భావిస్తున్నారు.
మనదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మారుతుంటాయి. అంతేకాదు పన్నులు, ఇంపోర్ట్ డ్యూటీలు, మారకం ధరల ఆధారంగా నిశ్చయమవుతాయి. ఈ అన్ని కారణాలను బట్టే దేశ వ్యాప్తంగా పసిడి ధరలు నిర్ణయమవుతాయి. పెళ్లిళ్లు, పండుగలు ఇతర శుభ కార్యాలకు బంగారం కొనడం, నగలు తయారుచేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.