గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి దిగొచ్చారు. భగవద్గీత పుస్తకాలు అమ్ముతున్న ఇస్కాన్ ప్రతినిధులను అడ్డుకున్న వ్యవహారంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నిరసనలు తెలిపారు. గల్లా మాధవి క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వచ్చాయి. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే.. మత మార్పిడులను నిరోధించకుండా.. శాంతియుతంగా ఒక స్టాల్లో భగవద్గీత పుస్తకాలు అమ్ముతున్న ఇస్కాన్ ప్రతినిధులపై ప్రతాపం చూపించడమేంటన్న ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వచ్చాయి. దీంతో, ఎమ్మెల్యే మాధవి వెనక్కి తగ్గారు. తాడేపల్లి బైపాస్ వద్ద ఉన్న ఇస్కాన్ ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో మాధవిని ఇస్కాన్ ప్రతినిధులు సాదరంగా ఆలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ పుస్తకాలు అమ్మడం పద్ధతికాదని, ప్రచారం చేయొద్దని ఎప్పుడూ తాను అనలేదన్నారు. ప్రజలకు ఇబ్బంది అయితే మాత్రం ఏ అంశమైనా ప్రశ్నిస్తానన్నారు. అంతేకాదు.. నెపం మొత్తం మీడియా మీదకు నెట్టేశారు. తనను, ఇస్కాన్ ప్రతినిధులను కొందరు మీడియాకు చెందిన వాళ్లు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తనకు కులం, మతం అనే తేడా లేదని, తన చిన్నతనం నుంచీ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నానని చెప్పారు. ఇస్కాన్ ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రతి శనివారం ఆలయంలో జరిగే నరసింహ యజ్ఞంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు.
- Advertisement with us -