తెలంగాణలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఫ్లోరైడ్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఎక్కడికో ఈశాన్య భారతానికి ఎగిరిపోయింది. పశ్చిమ బెంగాల్కు తరలిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2009లో ఈ ఫ్లోరైడ్ రీజినల్ రీసెర్చ్ సెంటర్ను మంజూరుచేసింది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఆ సెంటర్ను పశ్చిమబెంగాల్కు తరలించేందుకు కేంద్రం నిర్ణయించింది. అనుమతులు కూడా ఇచ్చేసింది. ఇంటర్నేషనల్ ఫ్లోరోసిస్ ఇన్ ఆర్సెనిక్ పేరుతో బెంగాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం తరలిపోవడానికి పూర్తిబాధ్యత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఎక్కడికో ఈశాన్య భారతానికి తరలివెళ్లింది.2009లో కేంద్రం దీన్ని మంజూరు చేయగా.. 2014లో చౌటుప్పల్లో ఈ సెంటర్ ఏర్పాటుకు 8 ఎకరాల స్థలం కేటాయించారు. కానీ, ఆ తర్వాత దీన్ని పట్టించుకోవడం మానేశారు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ సెంటర్పై రెండు ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. దీంతో.. ఇప్పుడు ఈ కేంద్రం కాస్తా పశ్చిమబెంగాల్కు తరలిపోయింది.
జాతీయ స్థాయిలో ప్రధాన సమస్యగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రీజినల్ ఫ్లోరోసిస్ మీటిగేషన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ ప్రతిపాదించింది. దీంతో 2009లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. అంతేకాకుండా ఉమ్మడి ఏపీ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్గఢ్, పుదుచ్చేరి, గోవా, అసోం, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రజలకు సైతం ప్రయోజనం కలిగేలా ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా తొలి విడతలో 20 బెడ్స్తో హాస్పిటల్ను నిర్మించాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సెంటర్ కోసం చౌటుప్పల్ ఏరియాలో 8 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే, అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విబేధాలు ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లను మంజూరు చేయలేదు. అంతేకాకుండా.. ప్రాజెక్ట్ కేంద్రం పరిధిలోకే రాదని, అందుకే నిధులు కేటాయించడం లేదని 2019లో కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకనే ప్రాజెక్ట్ను పట్టించుకోలేదన్న వాదన వినిపించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులతో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామన్న ఆలోచనతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.
బీఆర్ఎస్, ఎన్డీఏల మధ్య రాజకీయ గొడవల కారణంగానే తెలంగాణకు మంజూరైన ఈ అరుదైన కేంద్రం పశ్చిమ బెంగాల్కు తరలిపోయిందన్న వాదనలున్నాయి. ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పేరును ‘ఇంటర్నేషనల్ ఫ్లోరోసిస్ ఇన్ ఆర్సెనిక్’గా మార్చి 2020లో బెంగాల్లో ఏర్పాటు చేసింది. ఇంత జరిగినా బీఆర్ఎస్ సర్కార్ కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. నల్గొండ జిల్లాలో ఇప్పుడు మళ్లీ ఫ్లోరోసిస్ జాడలు బయటపడుతుండగా ఈ సెంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.బీఆర్ఎస్ సర్కారు చేసిన మరో పొరపాటు బయటపడింది.