- తండ్రీ కూతుళ్ళు… వియ్యంకులు, మామా అల్లుళ్ళు కూడా
- కూటమి ప్రభుత్వంలో బంధువులకే పదవులు
- కష్టపడినవారికి పదవులెక్కడ అంటూ ప్రశ్నిస్తున్న తమ్ముళ్ళు
చంద్రబాబు నిజంగానే మారారు… తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో సార్లు మారారు. అయితే ఈ తడవ అధికారం చేపట్టినప్పుడు నేను మారాను… నాలో 1995 చంద్రబాబును చూస్తారు అని అనేక సభల్లో ప్రకటించుకున్నారు. ప్రకటించినట్లుగానే చంద్రబాబు మారారు కానీ 1995 చంద్రబాబులా కాదు… ఎవరేమనుకుంటారో అనే శసభిషలు లేకుండా… ప్రజాభిప్రాయాన్ని, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను అస్సులు పట్టించుకోకుండా తను అనుకున్నది తాను నిరభ్యంతరంగా చేసేవిధంగా చంద్రబాబు మారు మనసు పొందారు. గతంలోనూ తాను అనుకున్నదే చేసినా నిర్ణయం తీసుకునే ముందు పార్టీ సినియర్లు, పోలిట్ బ్యూరో సభ్యులతో రోజుల తరబడి చర్చలు చేసి తన మనసులో మాట వారితో చెప్పించి ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రొజెక్ట్ చేశావారు. అయతే మారిన చంద్రబాబు ఇప్పుడు అంత కసరత్తు చెయ్యడం లేదు. అసలు పార్టీలో సీనియర్ల జాడే లేదు… పోలిట్ బ్యూరో ఉనికిలో ఉందో లేదో తెలియదు. ఏ నిర్ణయం తీసుకున్న కూటమికి బీటలువారకూడదు… కుమారుడి రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ఉంటున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఈ సారి ఫ్యామిలీ ప్యాకేజీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారం వస్తుందో రాదో అనే ఆందోళణలో అనేక వ్యూహాలు పన్ని జనసేన, బీజేపీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటులో ఈ సారి ఎటువంటి సమీకరణలకు తావు ఇవ్వలేదు. కేవలం కూటమి బీటలు వారకుండా పవన్ కళ్యాణ్ ని సంతృప్తి పరచుకుంటూ కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు నేషనల్ హైవే వేసుకుంటూ ముందకు వెళుతున్నారు. ఈ క్రమంలో కుటుంబానికి ఒకటే పదవి అనే నియమాన్ని పక్కకు పెట్టేసి ఒక్కో కుటుండానికి రెండేసి మూడేసి పదవులు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు. తొలుత మంత్రివర్గం కూర్పులోనే తనతో పాటు తన కుమారుడ్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే కింజరపు కుటుంబం నుంచి అచ్చెంనాయుడికి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇవ్వగా ఆయన అన్న కుమారుడు రామ్మోహన్నాయుడ్ని కేంద్ర మంత్రిని చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని ప్రకటించి… ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో అన్నాతమ్ముళ్ళిద్ధిర్నీ ఒకే సారి మంత్రులుగా చూసే అరుదైన అవకాశం ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించారు.
అసలు టిక్కెట్ల కేటాయింపు జరిగినప్పుడే ఇటువంటి సమీకరణలన్నింటినీ అటకెక్కించేశారు చంద్రబాబు. యనమల అప్పటికే శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నా ఆయన కుమార్తె దివ్యకు తుని శాసనసభ నుంచి అవకాశం కల్పించారు. అలాగే యనమల వియ్యకుండు పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వగా యాదవ్ కుమారుడు హరీష్ ను ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించారు. ఇక కింజరపు కుటుంబానికి బంధుత్వాలు ఉన్న మరో ఇద్దరికి కూడా అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు. కేంద్ర మంత్రి రమ్మోహన్నాయుడు బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ కు రాజమహేంద్రవరం అర్బన్ టిక్కెట్ ఇవ్వగా అదే రామ్మోహన్నాయుడు మామ బండారు సత్యన్నారాయణ మూర్తికి మాడుగుల టిక్కెట్ ఇచ్చారు. ఈ లెక్కన చూస్తూ రాష్ట్రంలో కింజరపు కుటుంబం వారి బంధువులు కలిపి నలుగురు కూటమి ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఇక చంద్రబాబుకు వియ్యంకుడు, నారాలోకేష్ మామ నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ టీడీపీ తరపున విశాఖపట్నం లోకసభ సభ్యుడిగా ఉన్నారు. మరో ఆసక్తికర బంధుత్వం గంట శ్రీనివాస్ ది. గంటా టీడీపీ తరపు భీమిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహిస్తుంటే ఆయన ఒక వియ్యంకుడు పొంగూరు నారాయణ చంద్రబాబు క్యాబినేట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గంటా మరో వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన తరపున శాసనసభ్యునిగా పోటీ చేసి గెలిచారు.
ఇవన్నీ ఒకెత్తైతే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ రెండో అన్న కొణిదెల నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించడాన్ని టీడీపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని వింతలను ఈ సారి కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని దేశం శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ని అధికారం నుంచి దించిన తరువాత చంద్రబాబు ఇటువంటి వింత వింత నిర్ణయాలు ఇప్పటి వరకూ తీసుకోలేదని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. కూటమి ధర్మం పాటించాలంటూ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మాకుచికాకు తెప్పిస్తున్నాయంటున్నారు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. ఓపక్క భర్తీ చెయ్యాల్సిన నామినేటెడ్ పోస్టులు అనేకం ఉండగా వాటిని నానబెట్టి కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తూ మరో పక్క ఇటువంటి అసంబద్ద నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తోన్నవారికి మంత్రిపదవులు దక్కడం లేదని, ఆరు, ఏడు సార్లు గెలిచిన వారికి మంత్రిపదవులు ఇవ్వని చంద్రబాబు..ఎమ్మెల్యేగా ఎన్నిక కాని వారికి మంత్రి పదవులు ఇస్తున్నారనే అసంతృప్తి టిడిపి పార్టీలో నెలకొంది.