తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలయ్యింది. ప్రధానంగా హైదరాబాద్లో ఎలక్షన్ హీట్ నెలకొంది. మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇవాల్టితో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు పూర్తవుతోంది. దీంతో, చివరి రోజు బీజేపీ, ఎంఐఎం తమ అభ్యర్థులను ప్రకటించాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును బీజేపీ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్ రావు పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. గౌతమ్ రావు గతంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
మరోవైపు.. ఎంఐఎం కూడా తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసింది. మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ను ఎంఐఎం పార్టీ ఎంపిక చేసింది. గతంలో 2009లో నూర్ ఖాన్ బజార్, 2016 లో డబిర్ పురా కార్పొరేటర్ గా గెలుపొందిన మీర్జా రియాజ్. 2019 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం అవకాశం ఇచ్చింది. 2023 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తయ్యింది. ఇప్పుడు ఎంఐఎం తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనకే అవకాశం ఇచ్చింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో.. కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాల్టితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండగా.. ఏప్రిల్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఏప్రిల్ 23వ తేదీన ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
ఇప్పటి వరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పోటీలో ఉండబోమని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటివరకు దాఖలైన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే.. ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు.
హైదరాబాద్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 112 మంది ఓటర్లు ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంఐఎం నుంచి 1 ఎంపీ, 7గురు ఎమ్మెల్యేలు, 1ఎమ్మెల్సీ, 40 కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఓటర్లు ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి 14 ఓటర్లు ఉన్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి 15 మంది కార్పొరేటర్లు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలుతో కలిపి 24 మంది ఓటర్లు, బీజేపీ నుంచి 22 ఓటర్లు ఉన్నారు.