- ఉద్యమాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు
- జూన్ 9న లక్ష మందితో చలో హైదరాబాద్.
- ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన జేఏసీ.
- ఉద్యోగుల హెచ్చరికపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ.
- ఎంతసేపు డిమాండ్లే తప్ప.. బాధ్యతల గురించి మాట్లాడారని విమర్శ
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజానికి ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు మొదటగా తమ ప్రయోజనాలనే ప్రస్తావిస్తాయి. మాకేంటి అని అడుగుతుంటాయి. అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అనే విషయాన్ని జేఏసీ నేతలు సైతం అంగీకరిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఏర్పాటులో ఉద్యగ సంఘాల పాత్ర కీలకమని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఎముక లేకుండా ఉద్యోగ సంఘాలకు వరాలు ఇచ్చేశారు. తాజాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు జేఏసీ నేతలు పెద్ద డిమాండ్ల చిట్టానే పెట్టారు. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే.
యుద్ధప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలి
పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి
ఉద్యోగుల హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను పూర్తిస్థాయిలో అమలుచేయాలి
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దుచేసి, పాత పింఛన్ విధానం అమలుచేయాలి
51% ఫిట్మెంట్ పీఆర్సీ ఇవ్వాలి
స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో-317ను అమలుచేయాలి
అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీ (డీపీసీ) లను ఏర్పాటు చేసి, ప్రమోషన్లు కల్పించాలి
ఎన్నికల సమయంలో బదిలీచేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి.
2025 మే, జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలను చేపట్టాలి.
ఈ డిమాండ్లను సకాలంలో అంగీకరించకపోతే జూన్ 9న లక్ష మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని… మే 15 నుంచి ఉద్యమ కార్యచరణను అమలు చేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బహిరంగంగానే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా చాలా సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ఇలాంటి డిమాండ్ చేస్తున్నాయి అన్న విమర్శ కూడా ఉంది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు తమ డిమాండ్లను అడగడంలో తప్పులేదు కానీ బ్లాక్ మెయిల్ చేసే విధంగా హెచ్చరికలు చేయడాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. పని విషయంలో కూడా అంతే ఉత్సాహ, నిబద్దత కనబరిస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఉద్యోగులు సైతం అంగీకరిస్తున్నారు.
సెక్రటేరియట్ నుంచి మొదలుకొని మండల కార్యాలయం వరకు ఉద్యోగులు సకాలంలో ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారా అంటే ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం అవుతాయి. ప్రజలకు మరింత సేవ చేస్తామని తమ డిమాండ్లను పరిష్కరిస్తే వారికి మరింత త్వరగా పథకాల అందజేస్తామని చెప్పాలి తప్ప హెచ్చరికల ద్వారా సమస్యలు పరిష్కారం కావని కొందరు అంటున్నారు. అయితే ఉద్యోగ సంఘాల హెచ్చరికలు, ప్రభుత్వ బుజ్జగింపులు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిసారి జరిగే తంతే అని… ఇరు పక్షాల నుంచి ఎంతో కొత రాజీధోరణి ఉంటుందని సమస్య ఎప్పటిలాగే సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో చిరుద్యోగులు ఉన్నారు.