జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను ముగించుకొని వెంటనే భారత్ చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్పోర్టులో దిగిన వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు. పహల్గామ్లో జరిగిన టెర్రర్ ఎటాక్ వివరాలతో పాటు.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిపై మోదీ రివ్యూ చేశారు. ఉగ్రవాదుల దాడి జరిగిన తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ భద్రతా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో అమిత్ షా పహల్గామ్ వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.
కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో టెర్రరిస్టులు అత్యంత భయానక దాడులకు పాల్పడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను ఒక్కొక్కరినీ పేర్లు అడుగుతూ మరీ చంపేశారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లను ఆసుపత్రులకు తరలించారు.
ఇక, ఈ దాడి అనంతరం పారిపోయిన ఉగ్రవాదుల గురించి భద్రతా బలగాలు అన్వేషణ మొదలు పెట్టాయి.