పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన వనౌటులో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదవడం ఆందోళన రేకెత్తించింది. వనౌటు దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమంగా 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తర్వాత పలుపార్లు ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో కూడా మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం ధాటికి పలుచోట్ల భవనాలు నేలకూలాయి. పోర్ట్ విలాలోని పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ భవనంలోని గ్రౌండ్ఫ్లోర్లో అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ఎంబసీలు కార్యాలయాలు ఉన్నాయి. ఈ భూకంపం కారణంగా భవనంలోని పైఅంతస్తులు కూలిపోవడంతో కింద ఉన్న ఎంబసీ ఆఫీసులన్నీ భారీగా దెబ్బతిన్నాయి. దీంతో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయా దేశాలకు చెందిన ఎంబసీలు ప్రకటన చేశాయి.
వనౌటులో సంభవించిన భూకంపం కారణంగా ఒకరు మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. పలువురు గాయపడ్డారు. అయితే, పూర్తి నష్టంపై ఇప్పుడే అంచనాకు రాలేమని అధికారులు చెబుతున్నారు. భూ ప్రకంపనల కారణంగా ప్రభుత్వ వెబ్సైట్లు పనిచేయడం లేదు. పోలీస్స్టేషన్లు, ఇతర ప్రభుత్వ విభాగాల ఫోన్లు కూడా కలవడం లేదని అంతర్జాతీయ మీడియాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.
భూకంపం సంభవించిన సమయంలో భవనాలు, వస్తువులు ఏ స్థాయిలో ఊగాయో స్థానచలనం చెందాయో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో ప్రజలు, జంతువులు పరిగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా ప్లా్ఫామ్లపై వైరల్గా మారాయి. పసిఫిక్ మహాసముద్రంలోని 80 చిన్న చిన్న దీవుల సముదాయమే వనౌటు దేశం. ఇక్కడ 3.30లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఇది రింగ్ ఆఫ్ ఫైర్జోన్లో ఉండటంతో ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అయితే, ఈసారి వచ్చిన ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సీసీ కెమెరాల దృశ్యాలు కూడా ధృవీకరిస్తున్నాయి. తాజా భూకంప తీవ్రత కారణంగా సముద్ర తీరంలో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే, కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.