మన దేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన మూడేళ్ల తర్వాత పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ ఓ నివేదికను రిలీజ్ చేసింది. మానవ తప్పిదం వల్లే ఆయన ప్రయాణిస్తున్న ఎంఐ-17 హెలికాప్టర్ కూలిందని పార్లమెంటరీ ప్యానెల్ నివేదికను అందజేసింది.
2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కున్నూర్ ప్రాంతంలో జరిగింది ఈ ప్రమాదం. వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తున్న ఆయన చాపర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్తో కలిపి మొత్తం 12 మంది మృతి చెందారు. వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధారించింది. హెలికాప్టర్ లోయలోకి వెళ్లగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని.. ఆ తర్వాత పైలెట్ మెఘాల్లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. ఫ్లైట్ డేటా రికార్డ్, కాకిపిట్ వాయిస్ రికార్డ్లతో పాటు.. అనేక మంది సాక్షులను విచారించిన తర్వాత ఈ నివేదికను రూపొందించింది కమిటీ.
2017 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 34 ప్రమాదాలు జరిగాయని తెలిపింది కమిటీ. ఇందులో 2021-22 మధ్యే ఏకంగా 9 ప్రమాదాలు జరిగాయి. వీటన్నింటిపై విచారణ జరిపిన స్టాండింగ్ కమిటీ.. ట్రైనింగ్, ఎక్విప్మెంట్, ఆపరేషన్స్ నిర్వహించడం, మెయింటనెన్స్కు సంబంధించి అనేక సూచనలు చేసింది.