వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం ఎత్తాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పారటీ సమావేశం జరగింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలతో వైఎస్.జగన్ మాట్లాడుతూ యావత్ ఆంధ్ర ప్రజానీకానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంపై పార్లమెంటులో గళం విప్పాలని జగన్ ఎంపీలకు సూచించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్ ఉభయసభల్లో వ్యతిరేకించాలని అన్నారు. మిర్చికి మద్దతు ధర, రాష్ట్రంలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన కొత్త మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రవేటీకరించాలని చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంటులో ఎండగట్టాలని ఎంపీలకు చెప్పారు. వీటన్నింటిపైనా ఎక్కడా రాజీ పడకుండా పార్లమెంటులో పోరాడాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన విషయంపై కూడా ఎంపీల సమావేశంలో జగన్ ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాల్సి ఉందని, ఆ మేరకు కేంద్రం స్పందించేలా మన ఎంపీలు అందరూ చొరవ చూపాలని వైఎస్.జగన్ ఎంపీలకు సూచించారు.