తెలంగాణ తల్లి విగ్రహంలో సబ్బండ వర్గాల ఆలోచనలు, ప్రతిరూపం ప్రతిఫలిస్తున్నాయని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశంసించారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుపై కేవలం ప్రకటన చేయటం సాధారణం కాగాముఖ్యమంత్రి చొరవ తీసుకొని సభ్యులకు విగ్రహ ఏర్పాటుపై అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇచ్చారన్నారు.
రాష్ట్ర అవతరణ, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చకు అనుమతి ఇచ్చి ఒక ఉన్నతమైన సంప్రదాయానికి ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. అందరి అభిప్రాయాలకు అవకాశం ఇచ్చినపుడు విపక్ష నేతలు మాట్లాడాల్సింది అన్నారు.
సభలో ఉన్న మేధావులు, పెద్దలు కొత్త విగ్రహాన్ని అభినందించారన్నారు. తెలంగాణ సమాజం కూడా దీన్ని స్వాగతించింది అన్నారు. విపక్ష నేత కెసిఆర్ సభలో అభిప్రాయం వ్యక్తం చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని కోరుకోలేదని… భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసినా గౌరవించేవారమని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సభ్యులు విభిన్న అభిప్రాయాలు ఉన్నా… శాసనసభ సమావేశాలు నిర్వహించామని ఉపముఖ్యమంత్రి గుర్తు చేశారు. అనుకూల, వ్యతిరేకవాదులు సభలోనే ఉండి వాదన వినిపించారని ఆనాటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. ఈ రోజు కూడా అలా జరిగి ఉంటే బాగుండేదన్నారు.
బీఆర్ ఎస్ నేతలకు తెలంగాణ తల్లి మీద అభిమానం ఉందా… కేవలం అధికారం మీద యావనా అని ఘాటుగా ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటన సమయంలో సోనియాగాంధీని… తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో అభినందించిన కెసిఆర్ ప్రకటన గుర్తు చేశారు.
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అప్పటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఒకేరోజు కావడం స్వాగతించాలన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ రోజు ఓ పండుగ మాదిరి ప్రభుత్వం నిర్వహిస్తుంటే బీఆర్ ఎస్ నేతలు కాదని వెళ్లటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి ఏటా నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.