-
వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్కు ఎంపికైన కృష్ణ భాస్కర్
-
భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్
వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్కు తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ ఎంపిక అయ్యారు. స్టాటిస్టిక్స్, అనాలిటిక్స్కు సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తోంది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్లో చదువుకొని అందులో చేసిన ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఆధారంగా ఈ ఫెలోషిప్ కు ఎంపిక చేశారు.
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫెలోషిప్ కోసం 2,600 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 33 మంది ప్రభుత్వంలో పని చేసిన అధికారులను ఎంపికగా చేశారు. కాగా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్ కావడం గమనార్హం. ఫెలోషిప్లో భాగంగా వాషింగ్టన్ డీసీలో తొమ్మిది రోజుల పాటు నేరుగా ట్రైనింగ్ పొందేందుకు రావాలంటూ వరల్డ్ బ్యాంక్ అధికారులు కృష్ణ భాస్కర్కు ఆహ్వానం పంపారు. ఆరు నెలల కోర్సులో భాగంగా ప్రత్యేక శిక్షణ తదుపరి డిజిటల్ అనుబంధంగా ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్కు ఎంపికైన కృష్ణ భాస్కర్ అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్సుకు సంబంధించిన వ్యయం మొత్తం వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది. స్టాటిస్టిక్స్, అనాలటిక్స్కు సంబంధించి అనుబంధాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించాలనేది వరల్డ్ బ్యాంక్ ఆలోచన. ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు అమెరికాలో ప్రత్యక్ష కోర్సు జరుగనుంది.
కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి అభినందనలు :
ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్కు ఎంపికైన తన స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ను గురువారం అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకరు ఎంపిక కావడం.. అదీ మన రాష్ట్రానికి చెందిన ట్రాన్స్కో సీఎండీ కావడంపై ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు