రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన GST కౌన్సిల్ సమావేశం జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించబడిన 55వ వస్తు మరియు సేవల పన్ను (GST) మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పలు ప్రతిపాదనలు చేయగా జిఎస్టి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ప్రధాన అంశాలు:
1.డెలివరీ సేవల పన్ను రేటుపై చర్చలో భాగంగా
రెస్టారెంట్ సేవలు, ఇతర డెలివరీ సేవలను ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా అందించడంపై పన్ను రేటు గురించి చర్చ జరిగింది. ఈ అంశం సాంకేతికంగా క్లిష్టమైనది, పన్ను అమలులో న్యాయం జరిగేందుకు ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. GST మండలి ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
2.రాష్ట్ర వారీగా మరియు రంగాల వారీగా జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM)
2019లో ఏర్పాటైన జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను కొనసాగించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించగా. ఈ ప్రతిపాదనను మండలి ఆమోదించింది.
3.అధిక IGST కేటాయింపుల పునరుద్ధరణపై చర్చ క్రమంలో
2015-16 ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా కేటాయించిన IGST పునరుద్ధరణ విషయంలో న్యాయబద్ధమైన విధానం అనుసరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ పునరుద్ధరణ తదుపరి ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ఆయన ప్రతిపాదించారు. మండలి ఈ ప్రతిపాదనను సైతం ఆమోదించింది.
4.అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం పై చర్చ జరగగా ATF ను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు, రాష్ట్రాలకు తక్కువ ఆదాయ వనరులు ఉన్నందున ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు వివరించారు. ఈ ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది.
5. బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) లావాదేవీలపై
1% సెస్ వేయాలని ఆంధ్ర ప్రదేశ్ కోరగా, వరదల వల్ల జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని అదే తరహా సౌకర్యాన్ని తెలంగాణకు కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ అంశాన్ని GoM (group of ministers)కు అప్పగించామని మండలి తెలిపింది. సమావేశంలో
రెవెన్యూ (కమర్షియల్ టాక్స్ & ఎక్సైజ్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.