అధికార విపక్షాల అరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ శాసనసభ యుద్ధరంగాన్ని తలపిస్తోంది. అసెంబ్లీలో గురువారం అప్పులపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల తూటాలు పేలాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరమే రూ. 1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 7 లక్షల కోట్లు కాదని.. 4 లక్షల కోట్లేనని తెలిపారు. భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ సర్కారుపై ఆరోపణలు చేశారు.
దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి బీఆర్ ఎస్ చిట్టా బయటకు తీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ అందుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో వెల్లడించారు. శ్వేతపత్రంలో చూపిన లెక్కలపై జవాబు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అబద్దాలు ప్రచారాలు చేయటంలో బీఆర్ ఎస్ నేతలు సిద్దహస్తులని ఘాటుగా విమర్శించారు. కెసిఆర్ హయంలో బయట నుంచి అప్పులు తీసుకువచ్చి అభివ్రద్ది పేరుతో దోచుకున్నారని… దాంతో పాటు రాష్ట్రంలోని వివిధ శాఖలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారని వివరించారు.
ఈ విధంగా పెండింగ్ లో పెట్టిన బిల్లులు 40 వేల 154 కోట్లుగా ఉన్నాయి. ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు, వివిధ ప్రభుత్వ శాఖలకు ఇవ్వకుండా బకాయిలు పేర్చారని వెల్లడించారు. ఇవి కూడా ప్రభుత్వానికి భారంగా పరిణమించాయని… వీటిని ప్రజా ప్రభుత్వం క్రమంగా తీరుస్తోందని తెలిపారు.
పదేళ్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని… ఏడాది కాలంగా దాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఉద్యోగులకు మార్చి నుంచి ఒకటో తారీఖునే జీతాలు వేస్తున్నామని… ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు.
నాలుగేళ్లలో రుణమాఫీ చేస్తామని ప్రజలను మభ్య పెట్టారని… ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిలోనే రుణమాఫీ చేసిందని చెప్పారు. ఓఆర్ ఆర్ టోలు వసూలు 30 ఏళ్లకు అప్పగించటం, హైదరాబాద్ లో విలువైన భూములు అమ్మి నిధుల దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
ఏడాదిగా గ్రహలక్ష్మి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రుణ మాఫీ, రైతులకు భీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. బీఆర్ ఎస్ హయంలో ఆపిన పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు.
సంక్షేమం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ ఎస్ నేతలు గురుకులాలు, ఆస్పత్రులు, జైళ్లలో బోజనం పట్టించుకోలేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డైట్ చార్జీలు రెండు వందల శాతం పెంచామని ప్రకటించారు. పదేళ్లలో విద్యార్థులను పట్టించుకోలేదు…తరగతిలోనే చదవడం, అక్కడే చదవటం తదితర ఇబ్బందులు ఉండేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమీక్రత గురుకులాలకు రూపకల్పన చేసిందని ఉపముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్ర సంపదను బీఆర్ ఎస్ దుబారా చేస్తే ప్రజా ప్రభుత్వం గాడిలో పెడుతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. హరీష్ రావుకు మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నా… ఆర్ బి ఐ రిపోర్టు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.