తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికార పార్టీ తరపున అన్నీ తానై వ్యవహరించారు. డిప్యూటీ సీఎం భట్టీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు సమన్వయంతో విపక్షాలను ఎండగట్టారు. సౌమ్యంగా మాట్లాడే భట్టి విపక్ష సభ్యుల ఆరోపణలకు బదిలిస్తూ తన విశ్వరూపం చూపించారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు వారం రోజులపాటు జరిగాయి. మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు శాసనసభ జరిగింది. ఈ సమావేశాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విపక్షానికి చుక్కలు చూపించారు. రాష్ట్ర అప్పులపై విపక్షం చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టి…వారి నోళ్లు మూయించారు.
జీరో అవర్, స్వల్పకాలిక చర్చ, బిల్లుల మీద చర్చ ఏదైనా సరే బీఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు చేసే ఆరోపణలకు భట్టి ఘాటుగా బదులిచ్చారు. వారం రోజుల పాటు సభలో ప్రభుత్వ విధానాలు, విజయాలను వివరించటంతోపాటు బీఆర్ఎస్ హయంలో జరిగిన నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు.
శాసనసభలో కెటిఆర్,హరీష్ రావు, శాసనమండలిలో ఎమ్మెల్యే కవిత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు యత్నించగా డిప్యూటీ సిఎం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను లెక్కలతో సహా వివరించారు.
రాష్ట్రానికి ఉన్న రుణ భారం ప్రజలకు తెలియచేసేందుకు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. లేనిది ఉన్నట్టుగా చెప్పటం బీఆర్ ఎస్ కు అలవాటైందని విమర్శించారు. శ్వేత పత్రంలో అన్ని వివరించినా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉందని, రాష్ట్రానికి ఉన్న అప్పులకు తోడు ఉద్యోగులు, కాంట్రాక్టు పనులు, ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బిల్లులు పెండింగ్ లో పెట్టారని వెల్లడించారు. అప్పులతో పాటు బకాయిలు అప్పచెప్పారని బీఆర్ ఎస్ పాలనపై మండిపడ్డారు.
ప్రజాప్రభుత్వంపై శాసనసభలో, వెలుపల బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్నిసార్లయినా లెక్కలతో సహా వివరించేందుకు సిద్దంగా ఉన్నట్టు ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలపై ప్రశ్నించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.
గత ప్రభుత్వం పదేళ్లలో సాధించిన దాని కంటే ప్రజా ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులు సాధించిందని డిప్యూటీ సీఎం వివరించారు. పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఏడాది కాలంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలతో తాను సభకు వచ్చానని ప్రకటించి ఎదురు దాడికి దిగారు.
అసెంబ్లీ సమావేశాలపై లాబీల్లో స్పందిస్తూ గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎలా వ్యవహరించిందో తాను స్వయంగా చూశానని, ఇప్పుడు అధికారం కోల్పోగానే హరీష్రావు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు.
విపక్షాలకు తగిన రీతిలో బుద్ది చెప్పారని డిప్యూటీ సీఎం భట్టీని పార్టీ అధిష్టానం, నేతలు అభినందిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గణాంకాలతో వివరించారని ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.