నెల రోజుల క్రితం ఎనిమిది మంది చిక్కుకున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూరుకుపోయిన మట్టి తవ్వకాలు, ఊట నీరు బయటకు పంపింగ్ చేసే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరి మృతదేహాలు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన ఆరుగురి జాడ కోసం సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పలు బృందాలు రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల సహాయక బృందాలు నిరంతరం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాలుగు ఎస్కవేటర్ లతో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు అడ్డుపడుతున్న టీబీఎం భాగాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని టన్నెల్ లోపల 2.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 150 HP సామర్థ్యం గల 5 పంపింగ్ స్టేషన్ల ద్వారా నిమిషానికి 3,600 లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి పంపిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో వుంటూ సహాయక బృందాలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు 24 గంటల పాటు నిరంతరం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని అధికారులు చెప్పారు. మట్టి తవ్వకాలు పూర్తయ్యాక లోకో ట్రాక్ను పునరుద్ధరిస్తామని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న పలువురు అధికారులు తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సొరంగం లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై, రెస్క్యూ పురోగతిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సహాయక చర్యల పర్యవేక్షణ కోసం నియమించబడిన ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో, ఆర్మీ అధికారి వికాస్ సింగ్ ,ఎన్ డి ఆర్ ఎఫ్, అధికారులు డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య , నాగర్ కర్నూల్ ఆర్డీవో సురేష్ , ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్, జే పి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.