ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగిందని… ఆ తర్వాత ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూస్తున్నామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు. ఇద్దరూ వేరు కాదు. ఒక్కటే అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు హామీ ఇచ్చిన సోనియా గాంధీ…తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు.
భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీల హామీ ఇచ్చామని, వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని, ఢిల్లి జనం కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నానన్నారు. తెలంగాణలో ఒకేసారి 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని గుర్తు చేశారు.
దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ మాట తప్పారని మండిపడ్డారు. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని సీఎం రేవంత్ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు, 500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణాలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.