140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఘన చరిత్ర కలిగిన ఈ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమంతోపాటు అభివృద్ధి కోసం పాటు పడిందని గుర్తు చేశారు. న్యూఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతోపాటు రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీకి సైతం పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీల ఆర్థిక పునాదులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం వేదికగా ప్రణాళికలు రూపొందించబోతోందని సీఎం పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలందరికీ ఇక్కడి నుంచే దశ దిశ నిర్ధారిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈ రోజు అద్భుతమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందని తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక వేదిక కాబోతుందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరామన్నారు. అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే వారిని కలిసి.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తామన్నారు.