కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే 194 వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల విముక్తికి తన జీవితం అంకితం చేసిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కట్టుబాట్లకు లోబడి మహిళలు బయటికి రాలేని రోజుల్లో మహిళా సాధికారత కోసం సావిత్రి బాయి పూలే పోరాడారన్నారు. ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే పేర్లను పెట్టేందుకు కృషీ చేస్తామని చెప్పారు. బీసీ ల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడటం అనైతికమని ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తుందన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క కార్పొరేషన్ కైనా నిధులు కేటాయించారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బీసీ బిడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే సత్తా ఉందా? అని సవాల్ చేశారు. తెలంగాణలో కుల గణన సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ జరగుతుందన్నారు. బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ లో పోరాడుతున్నామని చెప్పారు. జ్యోతిరావు పూలే తరువాత మరొక పూలే రాహుల్ గాంధీ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కుల గణన సర్వే చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. సం చేసి నిట్ట నిలువునా ముంచిన బిఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఫాం హౌస్ లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. బిఆర్ఏస్, బీజేపీ పార్టీలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా? అని మహేష్కుమార్ గౌడ్ సందేహం వ్యక్తంచేశారు.