- స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి
- అసెంబ్లీ అయినా… బహిరంగ సభ అయినా… దూకుడే దూకుడు
- కెసిఆర్ కు సవాళ్ళపై సవాళ్లు
- రేవంత్ రెడ్డి ప్రసంగాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్న ఎక్కడో కొంత స్లోగా ఉన్నారని ఆశించిన స్థాయిలో స్పీడ్ గా వెళ్లడం లేదని విపక్షాలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారన్న విమర్శ ఉండేది. అయితే గత రెండు మూడు వారాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలు, బహిరంగ సభల్లో విసురుతున్న సవాళ్లు, కామెంట్స్ పార్టీ క్యాడర్లో జోష్ పెంచుతుంది. మా నాయకుడు టాప్ గేర్ వేశారని ఇకపై అంతా దూకుడే దూకుడని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.
ముఖ్యంగా అసెంబ్లీ అదేవిధంగా బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ కార్యకర్తలను ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో విపక్షాలకు కూడా కౌంటర్ధీటుగా ఇస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీలో గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ సమావేశాలలో రేవంత్ రెడ్డి ప్రసంగం కొత్త జోష్ ని నింపుతోందని ఎమ్మెల్యేలు సైతం అంటున్నారు.
గతంలో సాదాసీదాగా ప్రసంగం కామెంట్స్ చేయడం వల్ల ఎక్కడో కొంత కిందిస్థాయి నాయకుల్లో జోష్ ఉండేది కాదని ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడుతున్న తీరు విపక్షాలకు ఇస్తున్న కౌంటర్ తమకు రానున్న కాలంలో ప్లస్ అవుతుందని నేతలు అంటున్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సంబంధించి ఎప్పుడు అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
గతంలో విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్న అసెంబ్లీలో ఆశించిన స్థాయిలో వారికి ధీటైన కౌంటర్ వేయలేకపోతున్నారన్న వాదన ఉండేది. ఇప్పుడు… ఎప్పుడు అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి వెంటనే సభలో ఉంటూ స్పందిస్తున్నారు. కెసిఆర్ అసెంబ్లీకి రాకపోవడం నుంచి మొదలుకొని.. గత ప్రభుత్వ అవినీతి కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలపై రేవంత్ రెడ్డి గట్టిగా తన వాదన వినిపిస్తున్నారు.
ప్రధాని మోడీ పట్ల కొంత సాఫ్ట్ గా రేవంత్ రెడ్డి ఉంటున్నారని ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్ కి ఆయన స్పందించారు. ప్రధానమంత్రి తో సఖ్యతగా ఉంటే తప్పేంటని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానితో మంచి సంబంధాలు ఉండాలని ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై సుమారు రెండున్నర గంటల పాటు ప్రసంగించిన రేవంత్ రెడ్డి చాలా అంశాల పై క్లారిటీ ఇచ్చారు.
అదే సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి సభలో అందుబాటులో ఉంటే రేవంత్ రెడ్డి తక్షణం రియాక్ట్ అవుతున్నారు. పొట్టి శ్రీరాములు పేరును తెలుగు యూనివర్సిటీకి తొలగించడం పై బిజెపి కొంత వివాదం చేసే ప్రయత్నం చేసినప్పటికీ దానికి గట్టిగానే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులాలు, మతాలు అడ్డుపెట్టుకుని చేసే రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని బీజేపీ ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు. అంతటితో ఆగకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాల్లో పూర్తిగా సహకరిస్తుందని ఆయన బిజెపిని ఇరుకునపెట్టారు.
కృష్ణా జలాలు, రాష్ట్ర అప్పులు వంటి విషయంలో కూడా బీఆర్ఎస్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ సభకు వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాలు కూడా చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇటీవల చేస్తున్న కామెంట్స్ సభలో మాట్లాడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీలో మాత్రం జోష్ పెంచినట్టుగా కనిపిస్తుంది