- కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి కేసు
- ఈ కేసులో గతంలో జారీ అయిన నోటీసులపై తెలంగాణ హైకోర్టులో వర్మ పిటిషన్
- కేసు ట్రయల్ కొనసాగుతుండగానే ఆర్జీవీకి సీఐడీ నుంచి మరోసారి నోటీసులు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. 2019లో వర్మ దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయంలో అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని బుధవారం సీఐడీ అధికారులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతకుముందు సీఐడీ జారీ చేసిన నోటీసులపై వర్మ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగానే సీఐడీ నుంచి మరోసారి నోటీసులు అందాయి. ఈ కేసుకు సంబంధించి వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు గత నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు స్వయంగా హాజరు కాకుండా తన లాయర్ని సీఐడీ కార్యాలయానికి పంపారు. సినిమా పనులతో బిజీగా ఉన్నందున తాను విచారణకు రాలేనని, తనకు 8 రోజుల గడువు కావాలని కోరారు. కానీ వర్మకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపించారు ఏపీ సీఐడీ అధికారులు.