- బ్రహ్మా ఆనందం మూవీ వేడుకలో వివాదస్పద కామెంట్లు
- ఇంట్లో ఆడపిల్లలతో విసిగిపోయానన్న చిరు
- అందుకే చెర్రీని కొడుకును కనమన్నాని కామెంట్
- మండిపడిన సోషల్ మీడియా.. ఏకి పారేసిన ఛానెళ్లు
- జనసేనను ప్రజారాజ్యంతో పోల్చిన చిరు
మెగాస్టార్ చిరంజీవికి ఏమైంది? మొన్నామధ్య సినిమా ఫంక్షన్స్ కి గెస్ట్ గా వెళ్లినప్పుడు ఆ ఆనందంలో లీకులిచ్చేసేవారు. మూవీ టైటిల్ను సస్పెన్స్ లో ఉంచుదామనుకుంటే దానిని తనకు తెలియకుండానే ముందే లీక్ చేసి నిర్మాతలు, డైరక్టర్లను ఇబ్బందులు పెట్టేసేవారు. ఇప్పుడు గత కొంతకాలంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. వృద్ధాప్య ఛాయలు చిరంజీవిని అలుముకుంటున్నాయా…? లేక ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
నిన్నిటికి నిన్న బ్రహ్మానందం కొడుకు సినిమా రిలీజ్ సందర్భంగా గెస్ట్ గా వచ్చి తనకూ బ్రహ్మానందానికి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అంతవరకూ బానే ఉంది. తననెవరూ ఇన్వయిట్ చేయలేదని బ్రహ్మానందం మీద ప్రేమతోనే వచ్చాననీ కూడా చెప్పారు. అదే వేదికపై తాత, మనవళ్ల అనుబంధం గురించి ఓ వీడియో ప్లే చేశారు. అందులో బ్రహ్మానందంతో పాటు చిరంజీవి తన మనమరాళ్లతో ఉన్నక్లిప్ ప్లే అయ్యింది.దానిపై స్పందిస్తూ ఆయన ఒక్కసారిగా అనూహ్యమైన కామెంట్లు చేసేశారు. తనకందరూ ఆడపిల్లూ, మనవరాళ్లేనని ఇల్లొక లేడీస్ హాస్టల్ను తలపిస్తోందని, తనది హాస్టల్ వార్డెన్ పాత్రలా అయిపోయిందని జోకులేశారు. అంతటితో ఆగకుండా… అందుకే రామ్ చరణ్ ను తన వారసత్వం నిలబెట్టడానికి కొడుకును కనమని అడిగానని ఇంటిగుట్టు బయటపెట్టారు.
ఉతికి ఆరేసిన సోషల్ మీడియా
చిరంజీవి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ సొషల్ మీడియా మాత్రం ఆయన్ను ఏకి పారేస్తోంది. ఈ చిచ్చు ఇక్కడితో ఆగలేదు. ఏకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరిగాయి. చిరంజీవికి జెండర్ సెన్సిటివిటీ లేదని, పక్కా స్త్రీ ద్వేషిలా మాట్లాడారని మహిళా సంఘాలు ట్రోల్ చేస్తున్నాయి. మగ పిల్లలే కాదు. ఆడపిల్లలు కూడా సమానంగా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించి ముందుకు తీసుకువెళ్లుతున్నారని చిరు ఆ నిజం తెలుసుకోవాలని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తినుంచి ఇలాంటి కామెంట్లు ఊహించలేదు. ఆయనింకా తుప్పుపట్టిన పురుషాధిక్య భావజాలంలోనే మగ్గుతున్నారు. ఆయన మైండ్ సెట్ మన సమాజ స్థితికి అద్దం పడుతోంది. సత్వరం దీన్ని మార్చు కోవాలంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. అయితే చిరంజీవి ఈ వివాదంపై స్పందించి ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ, సర్దుబాటు స్టేట్ మెంట్ ఇవ్వలేదు. వాస్తవానికి ఇటువంటి వివాదాల జోలికి చిరంజీవి వెళ్ళరు. ఆయన మాట్లాడే ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడతారు. అటువంటిది ఈ మధ్య కాలంలో ఆయన తాను యధాలాపంగా చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతున్నారు.
జనసేనకు జై కొట్టి…
అదేవిధంగా మొన్న లైల్ రిలీజ్ సందర్భంగా విశ్వక్ సేన్ ఫంక్షన్ కు వెళ్లిన చిరంజీవి తొలిసారిగా బాహాటంగా జై జనసేన అని నినాదం చేశారు. తమ్ముడు పార్టీ పెట్టాక ఇప్పటి వరకూ బాహాటంగా ఎక్కడ ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు పలకని చిరు తొలిసారిగా జనసేనను పొగిడారు. తాను నాడు పెట్టిన ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందని, పవన్ మరిన్ని విజయాలు సాధిస్తాడనీ… ఇలా సొంత తమ్ముడిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో ఒక్కసారిగా చిరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే పుకార్లు మొదలయ్యాయి. వెంటనే తేరుకున్న చిరంజీవి తన రాజకీయ గమనంపై రేగుతున్న ఊహాగానాలకు బ్రహ్మా ఆనందం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో తెరదించేశారు. పెద్ద వాళ్లతో తిరుగుతున్నాను కాబట్టి మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చాలామంది అనుకుంటున్నారు నేను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై కొట్టేసినట్లే అని స్పష్టంగా చెప్పేశారు. తాను బతికినన్నాళ్లు కళామతల్లికి దగ్గరగానే సినిమాలకే అంకితమవుతాను అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం చివరకు ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు తమ్ముడి పార్టీని తాను మూసేసిన పార్టీతో పోల్చడంపైనా రకరకాల సెటైర్లు పడుతున్నాయి.