ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, మరో రెండు సార్లు.. అంటే ఐదు, ఆరో సారి కూడా సీఎంగా చంద్రబాబు ఎన్నికవుతారని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ చెప్పారు. తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగ కర్త, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు.
పంచాంగ శ్రవణం సందర్భంగా సీఎం చంద్రబాబు భవిష్యత్తు గురించి ప్రస్తావించిన మాడుగుల… మరో పది, పదిహేనేళ్ల దాకా చంద్రబాబు అధికారానికి ఢోకా లేదని తెలిపారు. ఇక టీడీపీ నేతలు, కూటమి పార్టీల నేతల విషయాన్ని ప్రస్తావించిన శర్మ… పదవులు రాలేదని బాధ పడాల్సిన అవసరం లేదని నేతలకు సూచించారు. అర్హత ఉన్న నేతలకు కాస్తంత ఆలస్యమైనా వారి అర్హతల మేరకు పదవులు దక్కుతాయన్నారు. చంద్రబాబు చేతుల ద్వారానే ఆయా పదవులు నేతలకు అందుతాయని నాగఫణి శర్మ తెలిపారు.
ఇక, ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇకపై అమరావతికి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదన్నారు. ఇప్పటిదాకా అమరావతి సాగుతూ, ఆగుతూ కదిలినా ఇకపై నగరానికి ఎలాంటి ఢోకా ఉండబోదని తెలిపారు. అమరావతి నిర్మాణం ఇకపై నిర్విరామంగా సాగిపోతుందని కూడా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.