పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధి మాదల మేజర్ కాలువ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో మధిర సామ్రాజ్యం (50 ) మధిర గంగమ్మ (55 ), చక్కెర మాధవి( 30) తేనెపల్లి పద్మావతి (45 )అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.