ఇటీవల కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈనెల 8 వ తేదీన తిరుపతిలో తొక్కిసలాట జరిగింది.. ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఆఘటన మరువక ముందే ఈనెల 13 వ తేదీన లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రెండు వరుస ప్రమాదాలతో తిరుమలలో భక్తుల భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. తిరుమల పుణ్యక్షేత్రంకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇలాంటి ప్రదేశంలో జరగరాని సంఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రానికి చెడ్డపేరు వస్తుంది. దీంతో తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై కేంద్రం కూడా సీరియస్ గా స్పదించింది. ఇటీవల జరిగిన రెండు ఘటనలపై టిటిడిని ఇప్పటికే నివేదిక కోరిన కేంద్రం మరో కీలక చర్య చేపట్టింది. తిరుమలలో భద్రత, క్రౌడ్ మేనేజ్ మెంట్ విషయాలలో టిటిడి ఎటువంటి చర్యలు చేపడుతోందనే అంశంపై స్వయంగా కేంద్ర ప్రతినిధులే పరిశీలించనున్నారు. దీంట్లో భాగంగా రేపు కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమల చేరుకోనున్నారు. రేపు , ఎల్లుండి తిరుమలలో జిందాల్ పర్యటన ఉంది. పర్యటనలో భాగంగా ఘటనలకు గల కారణాలపై టిటిడి అధికారులతో జిందాల్ సమావేశం కానున్నారు. టిటిడి వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో జిందాల్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట వంటి ఘటన జరగడం ఏకంగా ఆరుగురు చనిపోవడంతో కేంద్రానికి టిటిడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతోంది. కేంద్రం జోక్యం జిందాల్ పర్యటనతో ఆగుతుందా…? లేక భవిష్యత్తులో మరింత పెరుగుతుందా…? అనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది.