భారత దౌత్యవేత్తలపై కెనడా ప్రభుత్వం పూర్తి నిఘా పెట్టింది. ఆడియో, వీడియోలతో సహా ప్రతి విషయాన్ని వాచ్ చేస్తోంది. ఈ విషయాలన్ని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం గురువారం చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ కెనడాలోని వాంకోవర్లో ఉన్న మన దేశ దౌత్యాధికారులపై ఆ దేశం ఆడియో, వీడియో నిఘా పెట్టిందన్నారు.
కెనడా అధికారుల నుంచే ఈ నిఘాకు సంబంధించిన భారత్ తెలుసుకుంది. మన అధికారుల ప్రైవేట్ కమ్యూనికేషన్స్ను కూడా అడ్డుకుని, పరిశీలిస్తున్నట్లు తెలిపారన్నారు. దీంతో మన దేశంలోని కెనడా హై కమిషన్కు ఈ నెల 2న నిరసన తెలిపామని చెప్పారు. కెనడా చర్యలు అన్ని దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు.
నిజానికి గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యను భారత్కు ముడిపెట్టాలని కెనడా ఆధారాల్లేని ఆరోపణలు చేస్తోంది. రోజుకో మాట మాట్లాడుతూ వివాదాన్ని పెంచుతోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో వేస్తున్న ఎత్తుగడలని ఆరోపణలున్నాయి.