ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరుపై స్వయంగా మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.వై.ఖురేషీ సైతం సందేహాలను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతానికి సంబంధించి తాజా వివాదంపై ఆయన ఒక జాతీయ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవీఎంల విశ్వసనీయతపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సాయంత్ర 5 గంటల వరకూ 55 శాతం ఓటింగ్ నమోదు అయినట్ల ఎన్నికల సంఘం ప్రకటించగా మర్నాడు తుది గణాంకాల్లో ఆ శాతం కాస్తా 66.05 శాతానికి పెరగడం ఆందోళణ కలిగించే అంశమని ఖురేషీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. రియల్ టైమ్ లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నమోదవుతుందని కానీ మర్నాడు తుది శాతం ప్రకటించినప్పుడు ఇంతటి వ్యత్యాసం సమర్ధనీయం కాదని ఖురేషీ అన్నారు. ఓటరు హాజరుతో పాటు, పోలింగ్ బూత్ లో జరిగిన పరిణామాలన్నింటినీ ఫారం-17సీలో నమోదు చేసి దానిపై అందరు అభ్యర్ధుల ఏజెంట్లతో సంతకాలు చేయించిన తరువాతే ప్రీసైడింగ్ అధికారి పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తారని… ఇంత రియల్ టైమ్ లో పోలింగ్ శాతం లెక్కింపు జరిగే పరిస్ధితులు ఉండగా మర్నాటికి శాతం ఏ విధంగా పెరుగుతుందో తనకు అర్ధంకావడం లేదని ఖురేషీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.