తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్ళు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులు వేయగలిగామని, అదే ప్రగతిని ఆర్బీఐ తన నివేదికలో తెలియజేసిందని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అన్ని రంగాలల్లో పురోగామిగా అతితక్కువ కాలంలో ఎదిగిందని లెక్కలతో సహా ఆర్బీఐనే చెప్పిందన్నారు. సోమవారం నాడు ఎర్రవల్లి ఫాంహౌసులో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘‘వందేళ్ళ ముందుచూపు’’ పుస్తకాన్ని గౌరీశంకర్ ఆయనకు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చితికిపోయిన తెలంగాణపల్లెను తిరిగి చిగురించేట్లు చేసుకోగలిగామన్నారు. నీళ్ళెక్కని ఎగువభూములకు నీళ్ళందించిన ఘనత తొలి తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. పూడిపోయిన చెరువుల్ని పూడిక తీయించి, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దూకేటట్లు చేసి చూపించామని చెప్పారు. ప్రతి వూరుకు మంచినీరందించామని, ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే ఎక్కువ పనులే చేసి చూపించిన చేతల ప్రభుత్వం బీఆర్ఎస్ దే అన్నారు.
చీకటిలో మగ్గిన తెలంగాణకు 24 గంటలు నిరంతరం విద్యుత్తును అందించన ఘనతను దేశమే చెబుతుందన్నారు. తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాల్లో సమున్నతంగా నిలిపేందుకు స్వరాష్ట్రంలో నూతన దారులు వేసిన ఖ్యాతి తమదేనన్నారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణను దేశానికే ధాన్యాగారంగా మార్చామన్నారు. స్వరాష్ట్ర సాధనలో గెలిచామని, తెలంగాణలో అభివృద్ధిని సాధించి చూపామని విశ్లేషించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అంత ఎత్తుగా తెలంగాణ అభివృద్ధిని పెంచి, తెలంగాణను పదేళ్ళలో దేశానికే మోడల్ గా చేశామని, ఈ మాట ఆర్బీఐనే చెప్పిందని గుర్తుచేశారు. నిజం నిలకడమీదనే తెలుస్తదని తెలంగాణ సమాజానికి బాగా తెలుసన్నారు. అబద్దాలు ఎప్పటికీ నిజాలు కావని, తెలంగాణ ఉజ్వల చరిత్రనుఎవ్వరూ చెరిపేయలేరని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయటంతో పాటుగా గంగాజమునా తెహజీబ్ సంస్కృతిని చెక్కుచెదరకుండా కాపాడగలిగామని కేసీఆర్ అన్నారు.