- ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా
- పరిస్థితికి బైడన్ ప్రభుత్వమే కారణమన్న మస్క్
- స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ లాంచింగ్ లో మస్క్ బిజీ
- ఫ్రీడం అనే క్రూ డ్రాగన్ కాప్సూల్ ద్వారా వెనకకు..
అంతరిక్షంలో అనుకోకుండా చిక్కుకు పోయిన అమెరికన్ ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లను వెనక్కురప్పించే అవకాశాలను పరిశీలించమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ వెల్లడించారు.
బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా గతేడాది జూన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికన్ ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్ అప్పటినుంచి అక్కడే చిక్కుకు పోయారు. వారి తిరుగు ప్రయాణం ఆలస్యం కావడం వెనుక గత జో బైడెన్ ప్రభుత్వ వైఫల్యం ఉందని మస్క్ విమర్శించారు. స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్ ను చాలానెలల క్రితమే నాసా సిద్ధంగా ఉంచినప్పటికీ బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఇప్పుడు తాము సాధ్యమైనంత త్వరగా వారిని వెనకకు తెచ్చే ప్రయత్నం చేస్తామని ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. మస్క్ స్పందన తర్వాత డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను త్వరలో వెనక్కు తీసుకొస్తామని ప్రకటించారు.గుడ్ లక్ ఎలన్ అని తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ట్రంప్ స్పందించారు. అయితే ఆస్ట్రోనాట్లిద్దరూ అక్కడ చిక్కుకు పోలేదని వారు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని నాసా తరచుగా ప్రకటిస్తూ వస్తోంది.
2024జూన్ లో ఐఎస్ఎస్ కు సునీత
గతేడాది జూన్2024లో బుచ్ మోర్, సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి చేరుకున్నారు.వారు అక్కడి అధ్యయనాలు ముగించుకుని పదిరోజుల్లో తిరిగి వెనక్కు రావాల్సి ఉండగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలు తలెత్తాయి. నాసా,బోయింగ్ స్టార్ లైనర్ సిబ్బంది ఆ స్పేస్ క్రాఫ్ట్ కు తలెత్తిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసినా ఫలితమివ్వలేదు. దాంతో అందులో ప్రయాణం సురక్షితం కాదని తేలిపోయింది. దాంతో స్పేస్ ఎక్స్ క్రూ నైన్ కాప్సూల్ ద్వారా వారిని వెనక్కు రప్పించాల్సిందిగా నాసా కోరింది.
స్పేస్ రంగంలో మస్క్ పట్టు
ఎలన్ మస్క్ సొంత సంస్థ అయిన ఈ స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి రెగ్యులర్ గా స్పేస్ క్రాప్ట్ లను పంపుతోంది.అక్కడున్న సిబ్బందికి నిత్యావసరాలు గట్రా అందించేందుకు ప్రతీ ఆరునెలలకు ఈ స్పేస్ క్రాఫ్ట్ వెళ్లి వస్తుంటుంది.
స్పేస్ ఎక్స్ నైన్ మిషన్ లో నలుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నలుగురిలో ఇద్దరిని మాత్రమే అనుమతించి అంతరిక్షంలోకి పంపి విలియమ్స్, బుచ్ విల్మోర్ లను వెనక్కు రప్పించేందుకు నాసా ప్రయత్నిస్తోంది.ఈ ప్రయాణం సెప్టెంబర్ లో జరగాల్సి ఉంది. కానీ ఈ మిషన్ సిద్ధంగా లేకపోవడంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ల తిరుగు ప్రయాణం మళ్లీ వాయిదా పడింది.అందుకు కారణం క్రూ -10 మిషన్ లాంచింగ్ ఏర్పాట్లలో స్పేస్ ఎక్స్ సంస్థ మునిగిపోవడమే. ఇప్పుడు క్రూ- 10 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నాకే క్రూ -9 ను అక్కడకు పంపే వీలుంది.
ఫ్రీడమ్ క్రూ డ్రాగన్ కాప్సూల్ ద్వారా..
అయితే మస్క్ తాజా ప్రకటన ప్రకారం ఫ్రీడం అనే పేరున్న క్రూ డ్రాగన్ కాప్సూల్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను తోడ్కోని భూమికి తిరుగు ప్రయాణం అవుతుందని తెలుస్తోంది.