బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫార్మాలా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో ఆయన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఈనెల 8వ తేదీన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాస్తవానికి అంతకుముందే ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో, కేటీఆర్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ అభ్యర్థనపై పిటిషన్ను సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీన పిటిషన్ దాఖలు చేసిన వెంటనే దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. కానీ, ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మరోవైపు.. సుప్రీంకోర్టులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి.
కేటీఆర్ దాఖలుచేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఫార్మూలా ఈ కారు రేసులో ప్రభుత్వ ధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదని, ఈ వ్యవహారంలో అసలు అవినీతి అనేదే జరగలేదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని వాదించారు. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ, హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి ఈ పిటిషన్ను డిస్మిస్ చేశారు.