నందమూరి తారక రామారావు.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు. సినీ రంగంలో దేవతా పాత్రలతో ప్రేక్షకుల మనసులు దోచిన ఎన్టీఆర్, రాజకీయాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పార్టీ ప్రారంభించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం అన్నది భారత రాజకీయ చరిత్రలోనే అపూర్వం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడిగా ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయం. పేదలకు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరచిపోలేనివి. నటుడిగా, నాయకుడిగా, సమాజ సేవాకారుడిగా ఎన్నో విభిన్న రంగాల్లో ఎన్టీఆర్ తన ముద్ర వేసారు.
అలాంటి గొప్ప వ్యక్తికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఇప్పటివరకు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ మరణించి 29 సంవత్సరాలు గడిచినప్పటికీ, ప్రతి సంవత్సరం ఆయన పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు అనేక మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని విన్నపాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాంగ్రెస్ హయాంలో ఎన్టీఆర్ను విస్మరించడం ఒక కారణమైతే, ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు కూడా సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఎన్టీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలహీనపరిచిన నేపథ్యంలో, గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఆయనపై కోపం ఉండటం సహజం.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభలో ఎన్టీఆర్ జ్ఞాపకాలను ప్రస్తావించడంతో మరోసారి భారతరత్న విషయంపై చర్చలు ఊపందుకున్నాయి. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా మారడం, అలాగే ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించడం వల్ల ఈ డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. మోదీ, చంద్రబాబు మధ్య పెరుగుతున్న సమన్వయం నేపథ్యంలో ఈసారి అయినా ఎన్టీఆర్కు భారతరత్న లభించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.
పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఎంజీఆర్కు మరణానంతరం భారతరత్న ఇచ్చారు. అయితే, తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్రం చిన్పచూపు చూస్తోందన్న అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజల మనస్సుల్లో ఉన్న కోరికను నెరవేర్చాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. ప్రధాని మోదీ తాజా వ్యాఖ్యలు ఈ దిశగా ఆశలు రేపుతున్నాయి.