ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు పెద్దలు. కానీ రచ్చ గెలుస్తూ వస్తున్న ఇంట మాత్రం వరుసగా మూడు మ్యాచ్ లు ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ సొంత గ్రౌండ్లో RCB ఎప్పుడు గెలుస్తుందా? అనే అభిమానుల ఆశలు నెరవేరాయి. చిన్నస్వామి స్టేడియంలో ఎట్టకేలకు RCB గెలిచి నిలిచింది. ఐపీఎల్లో మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ కు వేదికైంది చిన్నస్వామి స్టేడియం. ఆఖరి వరకు గెలుపు నీదా, నాదా అన్నట్టుగా సాగిన బెంగళూరు, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో గెలుపు ఛాలెంజర్స్దే అయ్యింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్కు చేరింది.
మ్యాచ్ ను టర్న్ చేసిన హెజిల్ వుడ్..
హెజిల్ వుడ్.. ఈ పేరును కొన్ని రోజుల వరకు ఎవరూ మర్చిపోరనడంలో అస్సలు డౌటే లేదు. చిన్నస్వామి స్టేడియంలో మరో ఓటమి తప్పదనుకున్న సమయంలో బాల్తో మ్యాజిక్ చేసేశాడు. 18వ ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే వీర విహారం చేసి ఏకంగా 22 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లకు.. 19వ ఓవర్లో చుక్కలు చూపించాడు. అనూహ్యంగా ధ్రువ్ జురెల్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. మూడో బాల్కు రివ్యూ తీసుకోవడం అనేది ఈ మ్యాచ్ అసలైన మూమెంట్ అని చెప్పాలి. ఎప్పుడైతే అల్ట్రాఎడ్జ్లో స్పైక్ లేచిందో.. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న చిన్నస్వామి స్టేడియం.. కేరింతలతో మారుమోగిపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆర్చర్ను కూడా ఔట్ చేసేశాడు హెజిల్వుడ్. దీంతో మ్యాచ్పై ఫుల్ కంట్రోల్ సాధించింది RCB. 19వ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీయడమే కాదు.. కేవలం ఒకే పరుగు ఇచ్చాడు హెజిల్వుడ్. ఇక ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన యశ్ దయాల్ చివరి ఓవర్లో వేసిన మొదటి బంతికే శుభమ్ దూబేను ఔట్ చేయడంతో చిన్నస్వామి స్టేడియంలో గెలుపు సంబరాలు మొదలయ్యాయి. ఇక మూడో బంతికి హసరంగాను కూడా అద్భుతంగా రనౌట్ చేశాడు జితేష్ శర్మ. దీంతో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు గెలుపు బెంగ తీరిపోయింది.
కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీలు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన RCB.. మ్యాచ్ను దూకుడుగానే ప్రారంభించిందని చెప్పాలి. సాల్ట్ తక్కువ స్కోర్కే వెనుదిరిగినా.. కోహ్లీ, పడిక్కల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ 70, పడిక్కల్ 50 పరుగులు చేశారు. పాటిదార్ సింగిల్ రన్కే వెనుదిరిగినా డెవిడ్, జితేష్ స్కోర్ను 200 పరుగులు పెట్టించారు. 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది RCB.
రాయల్స్ మరో’సారీ’
రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ ఆరంభించిన తీరు చూస్తే మరికొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించేస్తారేమో అనిపించేలా ఆడారు. జైశ్వాల్ అయితే RCB బౌలర్లపై వీర విహారం చేశాడు. 19 బాల్స్లో మూడు సిక్స్లు, ఏడు ఫోర్లు బాది 49 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న జైశ్వాల్ను హెజిల్వుడ్ ఔట్ చేయడంతో పరుగుల వరదకు బ్రేక్ పడింది. పరుగులు వస్తున్నా నితీష్, పరాగ్ను ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోకుండా అడ్డుకున్నారు. కానీ ధ్రువ్ జురెల్ మాత్రం మ్యాచ్ను రాజస్థాన్వైపు తిప్పేసి గెలుపు ఆశలను పెంచాడు. కానీ ఆఖరల్లో హెజిల్వుడ్ మ్యాజిక్తో గెలుపు RCB సొంతమైంది.