భారత సంతతీ టెకీ సుచీర్ బాలాజీ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఎవరీ బాలాజీ? అమెరికాలో చనిపోతే మనకేంటి సంబంధం? ఎందుకీ చర్చ? అనుకుంటున్నారా? కానీ అతను చనిపోయే ముందు చేసిన పనులు ఇప్పుడు అతని మృతిపై అనుమానాలు పెంచుతోంది. అంతేకాదు దీని వెనక ఏదో కుట్ర ఉందన్న వాదనలను తెరపైకి తెస్తుంది. బాలాజీ ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేశాడు. ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని డెవలప్ చేసింది. నాలుగేళ్లు అందులో పనిచేశాడు. అయితే అతను చనిపోవడానికి ముందు ఓపెన్ ఏఐ గురించి.. చాట్ జీపీటీ గురించి సంచలన విషయాలు బయటికి తీసుకొచ్చాడు. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించాడు. ఇంతలోనే అతని ఫ్లాట్లో నిర్జీవమై కనిపించాడు. అందుకే ఇప్పుడు మృతి.. ఇంత సెన్సేషన్గా మారింది.
శాన్ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లో సుచీర్ బాలాజీ మృతదేహాన్ని గుర్తించారు. అతను సూసైడ్ చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై ఫోకస్ చేస్తున్నామన్నారు అక్కడి అధికారులు. ఓపెన్ ఏఐలో 2020 నవంబర్లో చేరాడు బాలాజీ.. అప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు వర్క్ చేశాడు. ఈ మధ్యలోనే ఆ సంస్థ చేసిన తప్పిదాలను గమనించాడు బాలాజీ. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి చాట్ జీపీటీని డెవలప్ చేశారన్నది బాలాజీ ఆరోపణ. అంతేకాదు.. చాట్ జీపీటీ ఇంటర్నెట్ను శాసించే స్థాయికి ఎదగాలని చూస్తుందన్నారు. చాట్ జీపీటీని డెవలప్ చేయడంపై అతను ఏడాదిన్నర వర్క్ చేశాడు. దీనికి సంబంధించి అతను ఓ పోస్ట్ను పెట్టాడు ఎక్స్లో. ఈ పోస్ట్ చాలా వైరల్గా మారింది. ఓపెన్ ఏఐ పనితీరుపై అనేక అనుమానాలను రేకెత్తించింది. ఏదేమైనా ఉద్యోగాన్ని వదిలేయడం.. ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత మృతి చెందడం ఇప్పుడు అనేక అనుమానాలకు కారణమవుతుంది.