నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు ఘోరంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. సోమవారం నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రజెంటేషన్పై షర్మిల స్పందించారు. సోమవారం చంద్రబాబు మాట్లాడిన విధానం చూస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చి సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే అని షర్మిల విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలని మోకాలికీ బోడి గుండుకీ ముడిపెట్టి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని, 80 లక్షల విద్యార్థులకు ద్రోహం చేశారని, కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని, 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని షర్మిల ఆరోపణలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఇప్పుడు పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెపుతున్న చంద్రబాబుకు ఈ విషయం ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు తెలియదా అని షర్మిల నిలదీశారు. రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పిందీ మీరే… కూటమికి అధికారం ఇస్తే వంద రోజుల్లో గాడిన పెడతామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకూ సమంజసమని షర్మిల నిలదీశారు. కేంద్రంలో కీలకంగా ఉన్న మీరు రాష్ట్ర దీనస్ధితి ప్రధానికి వివరించి పథకాలకు నిధులు ఇమ్మని అడగమని పీసీసీ అధ్యక్షురాలు సలహా ఇచ్చారు. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే కేంద్ంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రమ్మని చంద్రబాబుని డిమాండ్ చేశారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల.
- Advertisement with us -