వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తే.. అంతా ఆత్మస్తుతి, పరనిందలా ఉందన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ. గత ప్రభుత్వాన్ని తిట్టడం, ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని పొగుడుకోవడమే బడ్జెట్ ప్రసంగంలో కనిపించిందన్నారు. ఈ తరహా సాంప్రదాయం కొనసాగించడం దురదృష్టకరమన్నారాయన.ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగా కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రజలను వంచించి, మోసం చేసిందని ఆరోపించారు. 18 నుంచి 50ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారని, ఆ మాటే లేదని అన్నారు.
బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని.. అలాగే, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకానికి సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో 81లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వాళ్లకు తల్లికి వందనం పథకం కోసం రూ.12వేల కోట్లు కావాల్సి ఉంటే.. రూ.9,400 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ఇక, 52 లక్షల మంది రైతులకు రైతుభరోసా రూ.20 వేలు ఇచ్చేందుకు రూ.12వేల కోట్లు అవసరం ఉండగా అరకొరగా నిధులు కేటాయించారన్నారు. ఉగాది నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్నారు.
గత ప్రభుత్వంలో రూ.3వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే.. ఈ బడ్జెట్లో రూ.300 కోట్లే పెట్టారని, గుంటూరు మార్కెట్లో ఒక్క కిలో, బస్తా, క్వింటల్ మిర్చినైనా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. జబ్బలు చరచుకోవడం కాదని, ఆచరణలో చూపిస్తామన్నారు.. చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ కూటమి సర్కారు ప్రవేశపెట్టింది ప్రజలకు న్యాయం జరిగే బడ్జెట్ కాదని, సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు ఈ బడ్జెట్తో న్యాయం జరగదని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.